తెలంగాణ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 1, (వాయిస్ టుడే)
Maoist party angry at Telangana government
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా మారిన ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాలు అందరికీ తెలిసిందే. ఓయూ కేంద్రంగా ఏళ్లతరబడి విద్యార్దులు చేసిన నిరసనలు ,ఆందోళనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే కదిలించిన ఘటనలు తెలిసిందే. అంతెందుకు తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ అప్పట్లో చేసిన ప్రకటనతో ఓయూ ఒక్కసారిగా భగ్గుమంది. ఆ మంటలు ఏకంగా కేంద్ర నిర్ణయాన్ని పునరాలోలించే పరిస్దితికి తీసుకెళ్లింది. తెలంగాణ ఏర్పాటు చేయక తప్పని పరిస్దితికి తీసుకొచ్చింది ఓయూలోని ఆందోళనలు, నిరసనలు అంతలా చరిత్ర సృష్టించాయి. విద్యార్ది ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచిన ఓయూలో ఇప్పడు నిరసనలు,ఆందోళనలు చేయొద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంపై ఇప్పటికే విద్యార్ది సంఘాలు భగ్గుమంటూ, ప్రతీ రోజూ నిరసనలు చేస్తుంటే.. తాజాగా మావోయిస్టు పార్టీ తీవ్రంగా స్పందించింది. ఓయూలో నిర్భంద ఆంక్షలు, హెచ్ సీయూలో భూముల వేలం ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ భూములను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి పథకాన్ని రూపొందించారని అందులో భాగంగానే యూనివర్సిటీలో ఘోరమైన నిరంకుశ పాలన కొనసాగుతున్నదని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల చేయడం కలకలం రేపుతోంది. పాలకుల విధానాల వలన గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈరోజు విడుదల చేసిన లేఖలో మావోయిస్టు పార్టీ ధ్వజమెత్తింది. రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధతను పట్టించుకోకుండా 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెడుతున్నారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని మండిపడింది.నియంతృత్వ విధానాలను అమలు చేస్తూ కనీస పౌర స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించింది మావోయిస్టు పార్టీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేయకూడదని ఈ నెల 13న ఓయూ రిజస్ట్రార్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన వారినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించిందని, యూనివర్సిటీల్లో విద్యార్థుల పోరాటాలను అణిచివేయడానికి ఈ నిషేదాజ్ఞలు విధించారని ఆరోపించింది. ఓయూలో ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల రాజ్యాంగ విరుద్ధం అని అప్రజాస్వామికం అని ధ్వజమెత్తింది. ఇలాంటి నిరంకుశత్వ చర్యలు దేశ భవిష్యత్తు ను నాశనం చేస్తాయని పేర్కొంది.విద్యను ప్రైవేట్ పరం చేసిన కార్పోరెట్లకు అప్పగించడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. ఓయూ యునివర్సిటీ విద్యార్థులు నిజాం మొదలు నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని దేశ రాజకీయాల్లో తెలంగాణ సామాజిక, రాజకీయ ఆర్థిక పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్నారు. విద్యార్థులు కేవలం సమస్యలకే పరిమితం కాలేదు ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి అనేక త్యాగాలు చేశారని లేఖలో ప్రస్తావించింది. నేడు చాలా మంది అనుభవిస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక ఫలాలన్నీ విద్యార్థులు చేసిన విరోచిత పోరాటాల ఫలితమేనని, కానీ నేడు దోపిడీ పాలక వర్గాలు మాత్రం దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల ప్రయోజనాలను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తింది. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం విధించిన నిర్భంద ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ ఆంక్షలను ఎత్తివేసే వరకు విద్యార్థులంతా ఐక్యంగా పోరాడాలని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ పిలిపునిచ్చింది.