**కాంగ్రెస్, బీజేపీలపై ఎంపీ వద్దిరాజు మండిపాటు
“డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నారని ఆరోపణలు**
MP Vaddiraju Lashes Out at Congress and BJP
హైదరాబాద్, (వాయిస్ టుడే):
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్ని దెబ్బతీయాలని కుయుక్తులు పన్నుతున్నాయని ఆరోపించారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకావడం లేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలిసినప్పటికీ రాష్ట్రానికి లాభం కలగలేదని విమర్శించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్ర నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ రవిచంద్ర ఆరోపించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావుపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు.
ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి, వేధింపులకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయాలు, వాహనాలపై దాడులు జరగడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న కేంద్ర మంత్రి సంజయ్ అనవసర వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తడం విచారకరమన్నారు.
ఇకనైనా అనుచిత వ్యాఖ్యలకు స్వస్తి చెప్పి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడంపై దృష్టి సారించాలని సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఎంపీ వద్దిరాజు సూచించారు.



