కాంగ్రెస్ సర్కార్ పై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కామెంట్స్

వద్దిరాజు రవిచంద్ర తెలంగాణలోని కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రజలకు కారు గుర్తుకు ఓటు ఇవ్వాలని విజ్ఞప్తి
కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పాలనలో అన్ని రంగాలలో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో అధోగతి పాలవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎంపీ రవిచంద్ర గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొత్తగూడెంలోని 10వ డివిజన్ బూడిదగడ్డ, 58వ డివిజన్ హనుమాన్ బస్తీ, 25వ డివిజన్ ఏ పవర్ హౌస్ బస్తీలలో విస్తృత ప్రచారం జరిపారు. ఎంపీ రవిచంద్ర మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, మాజీ వైస్ ఛైర్మన్ వేల్పుల దామోదర్, అభ్యర్థులు వేల్పుల వీరమ్మ, ఏమునూరి శివకృష్ణ, వేముల ప్రసాద్ బాబు, నాయకులు కొట్టి వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, నవతన్ తదితరులతో కాలినడకన వీధివీధి తిరిగి ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ కు ఘన విజయం చేకూర్చాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ఉత్తేజిత ప్రసంగం చేశారు, విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పూర్తిగా మర్చిపోయారని, ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతున్నది, ఇది కేసుల, పోలీసుల ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ కేసుల బనాయింపు, విచారణలు, బెదిరింపులు, వేధింపులు, అరెస్టుల భయం ఉండవద్దని, ప్రజలకు కొండంత అండగా కేసీఆర్ ఉన్నారని ఎంపీ రవిచంద్ర తెలిపారు.
ప్రజలు కేసీఆర్ రెండేళ్ల పాలనను, రేవంత్ రెడ్డి రెండేళ్ల ప్రభుత్వాన్ని పోల్చి చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు భంగపాటు తప్పదని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.
కాలినడకన సుమారు 6 కిలోమీటర్ల వరకు కొనసాగిన ప్రచార కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు గులాబీ జెండాలు చేబూని, కండువాలు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నినాదాలు ఇచ్చారు:
-
“జై తెలంగాణ జై తెలంగాణ”
-
“జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”
-
“వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”
-
“కారు గుర్తుకే మన ఓటు”
-
“గెలిపిద్ధాం గెలిపిద్ధాం కారు గుర్తుకు ఓటేసి గెలిపిద్ధాం”
తమ తమ డివిజన్లలో ప్రచారం కోసం విచ్చేసిన మునిసిపల్ ఎన్నికల ఇంఛార్జి, ఎంపీ రవిచంద్రకు మహిళలు హారతులు ఇచ్చి, బొట్టు పెట్టి స్వాగతం పలికారు, అభ్యర్థులు శాలువాలు కప్పి సత్కరించారు.



