Breaking News
Saturday, July 27, 2024
Breaking News

మహిళపై హత్యాచారం

- Advertisement -

మహిళపై హత్యాచారం
హైదరాబాద్, ఏప్రిల్ 22
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. చిత్తు కాగితాలు ఏరుకునే ఓ మహిళపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. కూకట్పల్లి పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలో (బాలానగర్ నుంచి కూకట్ పల్లి రోడ్డు) ఓ లాడ్జి పక్కనున్న భవనంలో వ్యాపార సముదాయాలున్నాయి. అక్కడి పైప్ వర్క్ షాప్ సెల్లార్ లో ఓ మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి ఒంటిపై దుస్తులు అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు తీవ్రంగా రక్తస్రావమైనట్లు ఆనవాళ్లున్నాయి. మృతదేహం పక్కన ఓ చిత్తు కాగితాలు ఏరుకునే సంచి లభ్యం కావడంతో ఆమె చిత్తు ఏరుకుని జీవిస్తుందని తెలుస్తోంది. అందులో దొరికిన ఓ చీటీపై రాసి ఉన్నది ఆమె పేరే కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతురాలిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా పాతికేళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఘటన జరిగిన భవనం పక్కన ఉన్న గల్లీలో కొన్ని నిమిషాలు ఆమెతో మాట్లాడడం గుర్తించారు. అనంతరం ఆమెను బలవంతంగా సెల్లార్ లోని షట్టర్ వద్దకు లాక్కెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై కూకట్పల్లి వైపు పారిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నాారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!