ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది.గేమ్స్ చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా అద్వితీయమైన ప్రదర్శనతో అదరగొడుతుంది. పతకాల వేటలో పోటీపడి మరీ భారత అథ్లెట్లు దేశానికి పతకాలు తీసుకొస్తున్నారు. తాజాగా భారత్ ఆసియా క్రీడల్లో తొలిసారి వంద పతకాల మార్కును అందుకుంది.శనివారం ఉదయం ఆర్చరీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు, మహిళల కబడ్డీలో బంగారు పతకం లభించడంతో భారత్ వంద పతకాలు ఘనత సాధించింది. ఇందులో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది.

మహిళల కబడ్డీ ఫైనల్ లో భారత్ 26-25తో చైనీస్ తైపీని మట్టికరిపించింది. దీంతో భారత్ స్వర్ణం దక్కించుకుంది. అంతకముందు ఆర్చరీ విభాగంలో భారత్ కు నాలుగు పతకాలు లభించాయి. ఆర్చరీ మహిళల కాంపౌండ్ సింగిల్స్ లో జ్యోతి సురేఖ స్వర్ణం సాధించగా, అదితి గోపిచంద్ కాంస్యం గెలుచుకుంది. ఇక ఆర్చరీ పురుషుల కాంపౌండ్ సింగిల్స్ లో ఓజాస్ ప్రవీణ్ డియోటలేకు స్వర్ణం లభించగా, అభిషేక్ వర్మ సిల్వర్ సొంతం చేసుకున్నాడు. ఆసియా క్రీడల్లో ఓజాస్ కు ఇది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం.
ఇక పతకాల పట్టికలో 354 పతకాలతో(187 స్వర్ణాలు, 104 రజతాలు, 63 కాంస్యాలు) చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. జపాన్ 169 పతకాలతో(47 స్వర్ణం, 57 రజతం, 65 కాంస్యం) రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో కొరియా 171 పతకాలతో(36 స్వర్ణం, 50 రజతం, 85 కాంస్యం) ఉంది. ఇక భారత్ సరిగ్గా 100 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. ఇవాళ మరిన్ని విభాగాల్లో భారత్ కు పతకాలు వచ్చే అవకాశముంది. ఇందులో క్రికెట్ లో స్వర్ణం లేదా కనీసం రజతం, బ్యాడ్మింటన్ లో సాత్విక్, చిరాగ్ జోడి స్వర్ణం లేదా రజతం సాధించే అవకాశాలున్నాయి. దీంతో భారత్ ఆసియా క్రీడలను 110 నుంచి 120 పతకాల మధ్యలో ముగించే అవకాశముంది.
ఆసియా గేమ్స్ లో శనివారం భారత్ షెడ్యూల్: కబడ్డీ పురుషుల ఫైనల్స్- భారత్-ఇరాన్(మధ్యాహ్నం 12.30 ); రెజ్లింగ్ (ఉ.7.30): యశ్, దీపక్ పూనియా, వికీ, సుమిత్; క్రికెట్ (ఉ.11.30): ఫైనల్- భారత్-అఫ్ఘానిస్థాన్; చెస్ (మ.12.30): పురుషులు, మహిళల తొమ్మిదో రౌండ్; హాకీ (మ.1.30): మహిళల కాంస్య పోరు- భారత్-జపాన్; బ్యాడ్మింటన్ (మ.1.30): డబుల్స్ స్వర్ణ పతక పోరు- సాత్విక్/చిరాగ్; వాలీబాల్ (ఉ.8.00): మహిళల 9-10 స్థానాల మ్యాచ్- భారత్-హాంకాంగ్; సాఫ్ట్టెన్నిస్ (ఉ.7.30): మహిళల క్వార్టర్స్- రాగశ్రీ, పురుషుల సింగిల్స్: అనికేత్ పటేల్.



