దిల్లీ: మణిపుర్ అంశం (Manipur)పై పార్లమెంటులో ప్రధాని మోదీ (PM Modi) ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ‘ఇండియా (India)’..
కేంద్ర ప్రభుత్వంపై ‘అవిశ్వాస తీర్మాన (No Confidence Motion)’ అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది. లోక్సభ (Lok sabha)లో కాంగ్రెస్ (Congress) డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్కు నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ వెల్లడించారు. అటు భారాస ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) ప్రవేశపెడితే.. ప్రధాని మోదీ మాట్లాడటంతో పాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్ కార్యాలయానికి కాంగ్రెస్, భారాస నోటీసులిచ్చింది..
ప్రస్తుతం లోక్సభలో ఎన్డీయే (NDA) కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపుర్ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది..
మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారా

న్యూఢిల్లీ, జూలై 26, (వాయిస్ టుడే): రాజ్యసభలో మాట్లాడుతుండగా మల్లికార్జున్ ఖర్గే మైక్ని ఆఫ్ చేయడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నా ఆత్మగౌరవాన్నే ప్రశ్నిస్తున్నారా” అంటూ మండిపడ్డారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో ప్రస్తావించకపోవడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభలు సజావుగా సాగడం లేదు. కచ్చితంగా దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుపడుతున్నాయి విపక్షాలు. ఈ క్రమంలోనే మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతుండగా ఆయన మైక్ కట్ అయిందని ఆరోపించారు. ఖర్గే కామెంట్స్ని ఖండించిన బీజేపీ ఎంపీలు “మోదీ మోదీ” అనే నినాదాలతో హోరెత్తించారు. ఫలితంగా..చాలా సేపటి వరకూ సభలో గందరగోళం నెలకొంది. ఆ తరవాత సభ వాయిదా పడింది. ఎగువ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గే…తాను మాట్లాడుతుండగా మైక్ ఆఫ్ చేసి ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఇప్పటికే విపక్ష ఎంపీలు లోక్సభ, రాజ్యసభల్లో మణిపూర్పై చర్చ జరగాలని నోటీసులిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానాన్నీ ప్రవేశపెట్టారు. మణిపూర్పై చర్చ జరిగేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆ తరవాత డీఎమ్కే ఎంపీ తిరుచ్చి శివ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కూడా రూల్ 267 ప్రకార నోటీసులిచ్చారు. కాంగ్రెస్కి చెందిన రంజిత్ రంజన్, రాజీవ్ శుక్లా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కూడా వాళ్లకు మద్దతుగా నిలిచారు. ప్రధాని మోదీ INDIA కూటమిని ఉగ్రవాదులు అని విమర్శించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు ఖర్గే. “మమ్మల్ని ఉగ్రవాదులు అని అంటూనే సభ సజావుగా సాగేందుకు సహకరించాలని హోంమంత్రి అమిత్షా ఎలా అడుగుతున్నారు” అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పార్లమెంట్లో మణిపూర్ హింసపై మాట్లాడాలని అమిత్షాకి లేఖ రాశారు ఖర్గే.మణిపూర్ హింసాకాండపై భగ్గుమన్న విపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసన తీర్మానం ప్రవేశపెట్టాయి. INDIA గా పేరు మార్చుకున్న విపక్ష కూటమి పూర్తి స్థాయిలో దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, BRS ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని అందజేశారు. లోక్సభలోని కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై పోరాడడానికి చివరి అస్త్రం ఇదే అని తేల్చి చెప్పారు.దీనిపై మాణికం ఠాగూర్ స్పందించారు. INDIA కూటమి ఈ విషయంలో కలిసి పోరాడుతుందని తేల్చి చెప్పారు. “INDIA కూటమి కలిసే ఉంటుంది. లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అంతా కలిసే నిర్ణయించుకున్నాం. ప్రధాని మోదీ గర్వాన్ని అణిచివేయాలన్నదే మా ఉద్దేశం. ఆయన వైఖరి అసలు బాగోలేదు. పార్లమెంట్కి రావడం లేదు. మణిపూర్పై ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. అందుకే…దీన్నే మా చివరి ఆయుధంగా మార్చుకున్నాం”