- Advertisement -
తెలంగాణలో ఆగని రైలు…
Non-stopping train in Telangana
సికింద్రాబాద్, ఫిబ్రవరి 3, (వాయిస్ టుడే)
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రైల్వేకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ మొత్తం త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ కేంద్రంగానే రూపొందించారు తప్పా.. మిగతా రాష్ట్రాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అంటున్నారు. ముఖ్యంగా.. కోకాపేట కోచ్ ఫ్యాక్టరీ పై ఎలాంటి స్పందన లేకపోవడాన్ని రాష్ట్ర నాయకత్వం విమర్శిస్తోంది. రైల్వేస్టేషన్ ఆధునీకరణ, డబ్లింగ్ పనులకు కూడా బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు జరపలేదని అంటున్నారు. బడ్జెట్లో రైల్వేలకు భారీ నిధుల ప్రకటన ఉంటుందని మొదటి నుంచి ఆశ పెట్టుకున్నారు. కానీ అనుకున్న అంచనాలకు దరిదాపుల్లోనూ కేటాయింపులు రాలేదు.రైల్వే శాఖకు మొత్తంగా రూ.2,65,200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో అత్యధికంగా భద్రత, ఎలక్ట్రిఫికేషన్ కి కేటాయించారు. రైల్వే బడ్జెట్ లో పెన్షన్ ఫండ్ కింద రూ.66 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపిన కేంద్రం.. కొత్త లైన్లు వేయటానికి రూ.3,235 కోట్లు వెచ్చించనుంది. రైల్వే సేఫ్టీ ఫండ్ కు రూ.45,000 కోట్లు కేటాయిస్తూ నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు చేశారు. కాగా.. ఈ మొత్తం బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించారంటూ తెలంగాణ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ లో ను రాష్ట్రానికి నిరాశ మిగిల్చారని అంటున్నారు. రాష్ట్రంలో విపక్ష పార్టీ అధికారంలో ఉండటంతోనే ఈ వివక్ష చూపించారు అంటున్న రాష్ట్ర నాయకులు.. బీహార్ల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడే భారీగా నిధులు కేటాయించిందని, తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం మొండి చెయ్యి చూపిందని ఆగ్రహిస్తున్నారు.కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు చేస్తారని తెలంగాణ ప్రభుత్వం ఆశించింది. ఇందుకోసం ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న కొత్త రైల్వే మార్గాలు, రైళ్లు, అదనపు లైను నిర్మాణానికి ఏకంగా రూ.83 వేల కోట్ల అవసరమవుతాయని అంచనాలు వేసిన రాష్ట్ర అధికారులు.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అనేకమార్లు విన్నపాలు పంపించారు. తెలంగాణలోని ఇంకా తొమ్మిది జిల్లాలకు అసలు రైలు మార్గమే లేకపోవడంతో ఆయా జిల్లాలకు రైల్వే సౌకర్యం కల్పించాలని తెలంగాణ వాసులు ఎప్పటినుంచో కోరుతున్నారు. అయినా వీటిలో వేటిపై కేంద్రం కరుణ చూపించలేదు.తెలంగాణ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులో నిధులు దక్కుతాయని ఆశించిన వాటిలో వేటికీ నిధులు దక్కలేదు. హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ రెండో దశ విస్తరణను పెద్ద స్థాయిలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఆశించగా నిరాశే ఎదురైంది. కొత్తగా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజనల్ రింగ్ రైల్వే లైన్ నిర్మిస్తామని కేంద్రంలో గతంలో తెలపగా.. దానికి రూ.12,500 కోట్లు కావాలని ప్రాథమిక అంచనా వేశారు. ఈ విషయమై కేంద్రం నోరు మెదపలేదు.శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడకు 220 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సెమీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు గతేడాది రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీని సర్వే ఏడాదిగా జరుగుతుండగా.. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి నిధులు కేటాయింపులు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీటితో పాటే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానీ, రాష్ట్రంలో మూడు రైల్వే లైన్ నిర్మాణం గురించి కానీ కేంద్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు
- Advertisement -