డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వెల్లడి
తాడేపల్లిగూడెం: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారు మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధి పనులకు డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు లో గురువారం రాత్రి గౌరీ దేవి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణాన్ని మంత్రి కొట్టు తిలకించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎంతో క్రమశిక్షణ, భక్తి భావంతో మెలిగే తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించిన సంకల్ప బలంతో రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఇందులో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడిని 225 కోట్ల రూపాయలతో సమగ్రమైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఈ అభివృద్ధి పనులకు డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారని ప్రకటించారు. అలాగే డిసెంబర్ 8వ తేదీన 125 కోట్ల రూపాయలతో చేపట్టే శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయి అన్నారు. 60 కోట్ల రూపాయలతో సింహాచలం దేవస్థానం, 80 కోట్ల రూపాయలతో అన్నవరం దేవస్థానం, 70 కోట్ల రూపాయలతో ద్వారకా తిరుమల దేవస్థానం అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. అలాగే శ్రీకాళహస్తి, కాణిపాకం ఇలా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు.
ఆలయాల అభివృద్ధి తో పాటు ధర్మ ప్రచారాన్ని చేపట్టామన్నారు. ధర్మాన్ని ఆచరించే వారికి భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. హిందుత్వం అనేది మతం కాదని అదొక ధర్మం అని, మంచి జీవన శైలికి మార్గమని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వివరించారు. 8 ఆగమాలతో విజయవాడలో మహా యజ్ఞం నిర్వహించడం తన తల్లిదండ్రుల పుణ్యఫలం తనకు దక్కినట్లుగా భావిస్తున్నాను అన్నారు. పెంటపాడు లో గత ఏడాది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించామని, ఈ ఏడాది సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేశారు.



