సెప్టెంబర్ 2న భారత్ – పాక్ హైవోల్టెజ్ మ్యాచ్
ఇండియా–పాకిస్తాన్ మధ్య అంటేనే క్రికెట్ అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. ఇప్పుడు ఈ హైకోల్టేజ్ మ్యాచ్లకు ఆసియా కప్ వేదిక కానుంది. ఇప్పుడు రెండు వారాల్లో మూడు సార్లు ఇండో–పాక్ వార్ ఫ్యాన్స్ను అలరించనుంది. వన్డే వరల్డ్ కప్కు మినీ వరల్డ్ కప్గా భావిస్తున్న ఆసియా కప్ 2023కి నేటి నుంచి తెరలేవనుంది. ఇవాళ్టి నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ముల్తాన్లో జరిగే ఆరంభ మ్యాచ్లో పాకిస్థాన్-నేపాల్ జట్లు తలపడనున్నాయి. నెల రోజుల్లో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్కు తమ జట్లను సిద్ధం చేసుకునేందుకు ఆసియా దేశాలు ఈ టోర్నీని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాయి.

ఇప్పటి వరకు జరిగిన ఆసియా కప్లో భారత్ అత్యధికంగా ఏడుసార్లు ఛాంపియన్గా నిలిచింది. దీంతో ఈసారి భారత్ హాట్ ఫేవరేట్ హోదాలో బరిలోకి దిగుతోంది. గతేడాది టీ20 ఫార్మాట్లో యూఏఈలో జరిగిన టోర్నీలో పాక్, శ్రీలంక చేతిలో ఓడి గ్రూప్ దశలోనే వైదొలిగిన టీమిండియా ఈసారి కచ్చితంగా టైటిల్ నెగ్గాలని ఆశిస్తోంది. గత ఓటములకు పాక్, లంకపై ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. కప్పు కంటే ముఖ్యంగా వరల్డ్కప్నకు ఇండియా టీమ్ను రెడీ చేసుకోవాలని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ కోరుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్లకు దూరంగా ఉంటున్నాడు. ప్రాక్టీస్లో అతని బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికీ మరో చిన్న దెబ్బ తగలడంతో వికెట్ కీపింగ్కు తను పూర్తి సిద్ధంగా కనిపించడం లేదు. రాహుల్ మాదిరిగా సర్జరీ నుంచి కోలుకున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సెప్టెంబర్ 2న పాకిస్తాన్తో పోరులో బరిలోకి దిగే చాన్సుంది. అలాగే, గాయాల నుంచి కోలుకొని ఐర్లాండ్తో టీ20లో రీఎంట్రీ ఇచ్చిన పేసర్లు బుమ్రా, ప్రసిధ్ కృష్ణ వన్డేలో ఎలా ఆడతారనే దానిపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.



