నేడు పాకిస్తాన్ లో పార్లమెంట్ ఎన్నికలు
ఇస్లామాబాద్:ఫిబ్రవరి 08
నేడు పాకిస్తాన్ లో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆర్థిక సంక్షోభం, బాంబు పేలుళ్లు, పెచ్చుమీరుతున్న హింస, రాజకీయ కక్షలు వంటి పరిణామాల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసేందుకు పాకిస్థాన్ ప్రజలు సంసిద్ధమయ్యారు.
కొత్త కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఆర్మీ అండదండలు ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్థాన్లో మొత్తం 12.85 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉండగా.. దేశవ్యాప్తంగా 90 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది.
ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఆ దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 6.50 లక్షల మంది సిబ్బందిని రంగంలోకి దించారు.
మరోవైపు బుధవారం రోజున బాంబు దాడులు జరిగిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ పార్ల మెంట్ లో మొత్తం 366 స్థానాలు ఉండగా 266 సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
ఈ స్థానాల కోసం మొత్తం 5,121 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ లకు కూడా ఈరోజే పోలింగ్ జరుగుతోంది…



