- Advertisement -
కాళేశ్వరం చుట్టూ రాజకీయం
హైదరాబాద్, ఏప్రిల్ 4, (వాయిస్ టుడే )
Politics Surrounding Kaleshwaram
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు మళ్లీ ‘కాళేశ్వరం‘ చుట్టూ తిరుగుతోంది. నిన్నటి వరకు కేవలం రాష్ట్రానికి పరిమితమైన ఈ వివాదం, ఇప్పుడు పార్లమెంట్ వేదికగా జాతీయ స్థాయి చర్చగా మారింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చేస్తున్న “కూలేశ్వరం” విమర్శలకు, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ రాజ్యసభలో ఇచ్చిన సమాధానం ఒక ఆయుధంలా మారింది. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పకడ్బందీగా వేస్తున్న వ్యూహాల మధ్య బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిపోయింది.రాజ్యసభలో అమరావతిపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు అడ్డుతగలడం వికటించింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దీనిపై ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని కుండబద్దలు కొట్టారు. ప్లానింగ్, డిజైన్ లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని కేంద్రం అధికారికంగా ప్రకటించడం బీఆర్ఎస్కు చావుదెబ్బ వంటిది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏవైతే ఆరోపణలు చేస్తోందో, వాటన్నింటినీ కేంద్రం ధ్రువీకరించినట్లయింది.సాధారణంగా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటాయి. కానీ, కాళేశ్వరం విషయంలో మాత్రం ఈ రెండు పార్టీల వాదన ఒకేలా ఉంది. కాళేశ్వరం ఒక అవినీతి తిమింగలమని, దీనివల్ల తెలంగాణకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం కాళేశ్వరాన్ని గత ప్రభుత్వం ఒక ఏటీఎం లాగా వాడుకుందని, కేవలం కమీషన్ల కోసమే రీ-డిజైనింగ్ పేరుతో వేల కోట్లు అదనంగా ఖర్చు చేశారని విమర్శించారు. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఇమేజ్ను దెబ్బతీయడంలో బీజేపీ సక్సెస్ కాగా, దానిని రాష్ట్రంలో పొలిటికల్ మైలేజీగా మార్చుకోవడంలో రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలు ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు బయటపడటం సాంకేతిక వైఫల్యాలు మాత్రమే కాదు, అవి రాజకీయ వైఫల్యాలుగా ముద్రపడ్డాయి. పార్లమెంట్లో అమరావతి అంశంపై మాట్లాడబోయి, కాళేశ్వరం అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ ఎంపీలు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం కాళేశ్వరంపై అటు రాష్ట్రంలో విజిలెన్స్ విచారణ, ఇటు కేంద్ర సంస్థల నివేదికలు కొనసాగుతున్నాయి. “లక్ష కోట్లు నీళ్లపాలు” అనే మాట బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ కావట్లేదు. ప్రాజెక్టు వైఫల్యంపై సమాధానం చెప్పలేక, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలను ఎదుర్కోలేక గులాబీ దళం ప్రస్పేతుతం రక్షణలో పడిపోయింది.
- Advertisement -