మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు

- Advertisement -

మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు

Pushkaras of Saraswati from May 15

వరంగల్, జనవరి 28, (వాయిస్ టుడే)
తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగుతుండటం విశేషం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం మే నెలలో 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉత్వర్వులిచ్చారు. సరస్వతీ నది పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం తదితర పనులను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్‌లను ఆదేశించారు.అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి సురేఖ సూచించారు. రాష్ట్ర ఏర్పాటయ్యే కంటే ముందు.. 2013లో వచ్చిన సరస్వతి నది పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో గతంలో కంటే మిన్నగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. అత్యంత వైభవోపేతంగా సరస్వతి నది పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.సరస్వతి పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండుగ. ఇది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని” (అదృశ్య నది)గా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు. ఇప్పటికే ఈ పుష్కరాల కోసం.. కాళేశ్వరం ఆలయ ముఖ్య అర్చకులు ముహూర్తాన్ని నిర్ణయించి అందుకు సంబంధించిన లేఖను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం.2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతుందని.. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు వివరించారు. మే 15 నుంచి 26 వరకు పుష్కర కాలం ఉంటుందని వివరించారు. ఈ మేరకు పుష్కరాల నిర్వహణ తేదీలను రేవంత్ర రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular