రజనీ.. రోజా…
నెక్స్ట్ ఎవరు…
గుంటూరు, మార్చి 14, (వాయిస్ టుడే )
Rajini.. Roja...
Who is next...
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నేతల అవినీతి వ్యవహారాలపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నాయకులపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు గట్టిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలపై లెక్కలు తేల్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. త్వరలోనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.తాజాగా వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పై కూడా సిఐడి అధికారులు ఫోకస్ పెట్టారు. ఇక ఇప్పుడు మాజీ మంత్రి ఆర్కే రోజాపై గట్టి ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆర్కే రోజా.. అవినీతి వ్యవహారాల్లో కూడా అదే దూకుడు ప్రదర్శించారనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది.ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం లో… ఆమె క్రీడా శాఖ మంత్రిగా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు అప్పట్లో టిడిపి నేతలు చేశారు. ఇక టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెపై కఠిన చర్యలు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే రోజా విషయంలో ఇప్పటివరకు అధికారులు ఎక్కడా దూకుడు ప్రదర్శించలేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె విషయంలో సైలెంట్ గానే ఉండిపోయింది. ఇక తాజాగా దీనిపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై సోమవారం కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. దాదాపు 119 కోట్ల నిధులు ఆడదాం ఆంధ్ర పేరుతో దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. ముఖ్యంగా బ్యాట్లు అలాగే క్రికెట్ కిట్లు కొనే విషయంలో ఆర్కే రోజా అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపణలు వినిపించాయి. నాసిరకం క్రికెట్ బ్యాట్లను అప్పట్లో పంపిణీ చేశారని క్రీడాకారులు కూడా ఆరోపించారు.దీనిపై పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు వాటన్నింటినీ బయటకు తీసి అవినీతి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అటు మరో మాజీ మంత్రి విడదల రజనీపై కూడా కేసుల నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై గవర్నర్ అనుమతి తీసుకునేందుకు కూడా సిఐడి అధికారులు ఇప్పటికే ఒక లేఖ కూడా రాశారు. గవర్నర్ అనుమతి వస్తే ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.