ప్రకృతి పరీక్షన్ అభియాన్ యాప్ లో నమోదు చేసుకోండి
Register in Prakriti Parikshan Abhiyan app
ప్రభుత్వ ఆయుర్వేద అధికారి డా. జి. యశోదర
నంద్యాల, నవంబర్ 27
ప్రజలు తమ శరీర ప్రకృతిని తెలుసుకోవడం కోసం దేశ్ కా ప్రకృతి పరీక్షన్ అభియాన్ యాప్ లో నమోదు చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ జి. యశోదర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచ మహాభూతాలు అనగా పృద్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పదార్థాలతో నిర్మించబడినదని… ఇదేవిధంగా ప్రకృతిలో భాగమైన మనిషి శరీరం కూడా ఈ ఐదు పంచ మహాభూతాలతోనే నిర్మితమై ఉంటుందన్నారు. ఈ పంచ మహాభూతాల ప్రభావం వల్ల మనుషుల శరీరాలు వాత, పిత్త, కఫ అనే మూడు రకాల ప్రకృతులలో ఏదో ఒక ప్రకృతిని కలిగి ఉంటాయన్నారు. ప్రకృతి అనగా శరీర, మానసిక తత్వం కొంతమంది శరీరతత్వం వాత ప్రకృతి గాను, కొంతమంది పిత్త ప్రకృతిగాను, కొంతమంది కఫ ప్రకృతిగాను ఉంటాయన్నారు. ఈ ప్రకృతిని బట్టి మనుషులకు జబ్బులు రావడం, రాకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయన్నారు. మన శరీర ప్రకృతిని అనుసరించి మనం ఆహారం, జీవనశైలి అలవాటు చేసుకుంటే రోగాలకు దూరంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అని భారతీయ వైద్యశాస్త్రమైన ఆయుర్వేదం చెబుతుందని ఆమె తెలిపారు.
ఈ విషయాన్ని గ్రహించిన భారత ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్ వారు దేశమంతా పౌరులు తమ శరీర ప్రకృతిని తెలుసుకోవడానికి కోసం దేశ్ కా ప్రకృతి పరీక్షన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దానిలో భాగంగా ఈ నెల 26వ తేదీన భారత ప్రధాన మంత్రి గారిచే” ప్రకృతి పరీక్షణ్” అనే ఒక మొబైల్ అప్లికేషన్ ప్రారంభించారన్నారు. ఈ మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ప్రజలు తమ తమ శరీర ప్రకృతిని తెలుసుకొని దాని ద్వారా ఆ ప్రకృతి అనుసరంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమి చేయాలి, ఏమి చేయకూడదో తెలుసుకొని జబ్బులు రాకుండా చూసుకోవచ్చు మరియు వచ్చిన జబ్బులు త్వరగా తగ్గేటట్టు చేసుకోవచ్చన్నారు. ఈ శరీరక ప్రకృతిని తెలుసుకోవడానికి కోసం ప్రజలు తమ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలు, అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు మరియు దగ్గరలో ఉన్న ఆయుర్వేద కళాశాలలకు తమ స్మార్ట్ ఫోన్ తో వెళితే అక్కడ వైద్యులు ప్రకృతి పరీక్ష అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రకృతి వివరాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రజలు అవకాశాన్ని వినియోగించుకొని దగ్గర్లో ఉన్న ఆయుర్వేద వైద్యశాలలకు స్మార్ట్ ఫోను తీసుకొని పోయి తమ శరీర ప్రకృతి తెలుసుకొని తమ శరీర ప్రకృతికి అనుగుణంగా నడుచుకొని జబ్బులు రాకుండా చూసుకోవాలని నంద్యాల జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, నంద్యాల వైద్యాధికారి డాక్టర్ జి. యశోదర ఆ ప్రకటనలో పేర్కొన్నారు.