టోక్యొకు చేరుకున్న రేవంత్, శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 16, (వాయిస్ టుడే)
Revanth and Sridhar Babu arrive in Tokyo
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టబడులను ఆహ్వానించేందుకు జపాన్లో పర్యటిస్తున్నారు. రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం జపాన్లోని టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా తదితర నగరాల్లో పర్యటించనుంది. ఏప్రిల్ 16 నుంచి 22 వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. రేవంత్ వెంట పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉన్నారు. గతంలో దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొని రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చారు.
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో సహకారం కోరడం ప్రధాన ఉద్దేశంగా రేవంత్ రెడ్డి టీం జపాన్ పర్యటనకు వెళ్లనుంది. సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం వారం రోజులపాటు జపాన్ లోని ప్రముఖ సంస్థల సీఈవోలు, ప్రతినిధులతో చర్చలు జరుపుతుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ‘ఒసాకా వరల్డ్ ఎక్స్పో -2025’ లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్, ఆయన టీమ్ బుధవారం నాడు టోక్యో చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి టీం బుధవారం నాడు టోక్యో చేరుకోనుంది. అక్కడ భారత రాయబారి ఆతిథ్య సమావేశంలో రేవంత్ పాల్గొనున్నారు. ఏప్రిల్ 17న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, సోనీ గ్రూప్, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ కార్పొరేషన్, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ సంస్థల అధినేతలు, ప్రతినిధులుతో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం సీఎం రేవంత్ తోషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు. వారితో మాట్లాడి కంపెనీ తీరు, లాభాలు, మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఈ 18న టోక్యోలో గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్రెడ్డి పుష్పాంజలి ఘటిస్తారు. టోక్యో గవర్నర్తో సమావేశం అవుతారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో నిర్వహించే భేటీలో రేవంత్ రెడ్డి, టీం పాల్గొంటుంది. ప్రముఖ కంపెనీలైన టొయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీల సీఈవోలతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొ రేషన్ ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరుపుతారు.జపాన్ పర్యటనలో భాగంగా సుమిదా రివర్ ఫ్రంట్ను రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. ఏప్రిల్ 19న టోక్యో నుంచి మౌంట్ ఫుజి, అరకురయామా పార్క్ల సందర్శనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 20వ తేదీన కిటాక్యూషు సిటీకి వెళ్లి అక్కడి మేయర్తో భేటీ అయి ఎకో టౌన్ ప్రాజెక్టుపై చర్చిస్తారు. ఎన్విరాన్మెంట్ మ్యూజియం, మురసాకి రివర్ మ్యూజియం, ఎకో టౌన్ సెంటర్ను ఆయన సందర్శిస్తారు. ఏప్రిల్ 21న సీఎం రేవంత్ రెడ్డి టీం ఒసాకా చేరుకుంటుంది. యుమెషిమాలో వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవి లియన్ను రేవంత్ రెడ్డి ప్రారంభించి బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఒసాకా రివర్ ఫ్రంట్ను సైతం సందర్శించనున్నారు. అక్కడి నుంచి ఏప్రిల్ 22న హిరోషిమా చేరుకుని పీస్ మెమోరియల్ను సందర్శించి గాంధీ విగ్రహానికి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్, తదితర నేతలు వరుసగా భేటీలలో పాల్గొనున్నారు. హిరోషిమా జపాన్, ఇండియా చాప్టర్తో బిజినెస్ లంచ్లో తెలంగాణ ప్రతినిధుల బృందం పాల్గొంటుంది. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. జపాన్ పర్యటన ముగించుకుని ఒసాకా నుంచి భారత్కు బయలుదేరనున్నారు. ఏప్రిల్ 23న ఉదయం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకుంటారని షెడ్యూల్ చేశారు.