దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
పాల్గొన్న సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్
Rich tributes paid on the occasion of Damodaram Sanjivayya’s death anniversary.
హైదరాబాద్, (వాయిస్ టుడే):
మాజీ ఏఐసిసి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 54వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ, దామోదరం సంజీవయ్య పేద కుటుంబంలో జన్మించి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన మహానేత అని కొనియాడారు. అత్యున్నత పదవులు చేపట్టినా జీవితాంతం నిరాడంబర జీవనం గడిపారని, సాధారణ ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకున్న నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు.
సొంత ఇల్లు కూడా లేకుండానే ఆయన మరణించడం ఆయన నిజాయితీకి, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని తెలిపారు. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సంజీవయ్య పాత్ర విశేషమని, నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు వాజిద్ నాయక్, బండి సురేందర్, ఈతికార్ వెంకటేష్, మురళీధర్, శకుంతల, శానవాజ్ తదితరులు, కార్యకర్తలు మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.



