పోల్ మేనేజ్ మెంట్ పైన గులాబీ ఆశలు

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 14, (వాయిస్ టుడే):  రాష్ట్రంలో వినూత్న పథకాలను అమలు చేస్తున్నా.. వాటి ఫలాలను అందుకుంటున్న వారు బీఆర్ఎస్ వైపు ఎందుకు నిలవడం లేదనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతున్నది . ట్రమంతా దాదాపు కోటిమంది లబ్ధిదారులున్నా  .. అనుకున్నంత స్థాయిలో ఆదరణ లభించడం లేదని ‘గులాబీ’ అభ్యర్థులు మదనపడుతున్నారు. దీనికి తోడు ప్రచార సమయంలో అడుగడుగునా నిరసనలు ఎదురవుతుండటంతో గెలుపుపై వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రజల్లో ఇంతగా వ్యతిరేకత, అసంతృప్తి పేరుకుపోడానికి కారణాలు తెలియక సతమతమవుతున్నారు. ప్రచారానికి ఇంకో రెండు వారాలే ఉండడంతో అప్పటివరకు పరిస్థితి ఏమవుతుందోననే అనుమానం వారిని వెంటాడుతున్నది. ఓటర్లంతా కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఉన్నారనే భావన వారిలో వ్యక్తమవుతున్నది.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫస్ట్ రౌండ్ ప్రచారాన్ని 18 రోజుల పాటు దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి చేశారు. అయినా అనుకూల పవనాలు కనిపించలేదని ఆ పార్టీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. పదేండ్ల పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆదుకుంటుందని భావించినా అది ఆ తరహా నమ్మకాన్ని కల్గించలేకపోయిందన్న బాధ వారిలో వ్యక్తమవుతున్నది. గత ఎన్నికల్లో పోటీచేసిన వారే (సిట్టింగ్ ఎమ్మెల్యేలు) దాదాపుగా ఈసారి అభ్యర్థులుగా ఉన్నారు. కానీ అప్పట్లో కనిపించిన ఆదరణ ఈసారి లేకపోవడం, గ్రామాల్లో సమస్యలపై అభ్యర్థులను నిలదీయడం, మూకుమ్మడిగా ప్రశ్నించడంతో క్యాండిడేట్స్ డైలమాలో పడ్డారు.ప్రజలు తమకు ఓటు వేసేలా లేరనే అభిప్రాయానికి అభ్యర్థులు వచ్చినట్టు సమాచారం. ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలను అమలు చేస్తున్నా.. వాటి ద్వారా లబ్ధిని చేకూరుస్తున్నా ఓటర్లు ఎందుకు దూరమయ్యారనేది వారికి సమాధానం లేని ప్రశ్నగా ఉండిపోయింది. ఇప్పటివరకూ కచ్చితంగా గెలుస్తామనే ధీమా ఏర్పడలేదని అభిప్రాయాన్ని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు వారి సన్నిహితులతో పంచుకుంటున్నారు.

Rosy hopes on poll management
Rosy hopes on poll management

ప్రజల నుంచి ఈసారి ఊహకు అందని విధంగా వ్యతిరేకత వ్యక్తమవుతుండటం అభ్యర్థులకు మింగుడుపడడంలేదు. రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, గృహలక్ష్మి, చేతివృత్తులకు చేయూత, కల్యాణలక్ష్మి.. ఇలాంటి ఎన్నో పథకాలున్నా, వాటి ద్వారా లబ్ధి పొందుతున్నా ప్రచారానికి వెళ్లినప్పుడు ఓటర్లు నిలదీస్తుండటం, ప్రచారానికి రావొద్దంటూ ఓపెన్‌గా ఫ్లెక్సీ బ్యానర్లు కట్టడం, గ్రామంలోకి వెళ్లిన ప్రచార రథాలను వెనక్కి పంపేయడం, మాట్లాడుతుండగానే నిరసనలు తెలియజేయడం, బహిరంగసభల సమయంలో మధ్యలోనే జనం వెళ్లిపోవడం.. ఇలాంటివన్నీ ఎన్నికల్లో ఓట్ల రూపంలో నెగెటివ్‌గా మారే ప్రమాదముందని అభ్యర్థులు ముందుగానే ఒక అంచనాకు వచ్చారు.ఓటర్ల నుంచి ఇంతగా ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతున్నది? అందుకు దారి తీసిన కారణాలు ఏంటి? అని తెలియక క్యాండిడేట్స్ సతమతమవుతున్నారు. అభ్యర్థి మీద కోపమా?.. లేక పార్టీపైనే ఆగ్రహమా?.. లేక ప్రభుత్వ పాలనలో లోపమా?.. లేక పథకాల అమలుపై అసంతృప్తా?.. నిర్దిష్టంగా వీటిలో ఏ కారణమో తెలియకపోవడంతో దిద్దుబాటు మార్గాలు తెలియక తికమక పడుతున్నారు. మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చినా, వివిధ పథకాల కింద ఇప్పుడు అందుకుంటున్న ఆర్థిక సాయాన్ని మించి ఇస్తామని చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదన్న నిర్ధారణకు వచ్చారు. రానున్న రెండు వారాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నదానిపై అభ్యర్థులు ఆలోచనలు చేస్తున్నారు.పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నవారు చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఓటేస్తారని, గెలిపిస్తారని ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ గాలి వీస్తున్నదనే ప్రజల ఓపెన్ టాక్‌లో మార్పు వస్తుందని, గులాబీ పార్టీ చివరి రెండు రోజుల్లో (ప్రచారం తర్వాత) అనుసరించే పోల్ మేనేజ్‌మెంట్ గట్టెక్కిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కేసీఆర్ స్పీచ్ తర్వాత కూడా ప్రజల స్పందనలో మార్పు రాకపోవడంతో ‘అద్భుతాలు జరిగితేనే..’ అనే అభిప్రాయానికి వచ్చారు. గతంలో లేని అనూహ్య పరిణామాలను ఇప్పుడు ఎదుర్కొంటుండడంతో ఎక్కడో రివర్స్ కొడుతున్నదనే అంచనాకు వచ్చారు. పథకాలు గట్టెక్కిస్తాయనే నమ్మకాన్ని కోల్పోయారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular