అఘోరీ శ్రీనివాస్పై సంచలన ఆరోపణలు.
తనను పెళ్లి చేసుకున్నాడంటూ మహిళా కమిషన్కు ఫిర్యాదు.
హైదరాబాద్
Sensational allegations against Aghori Srinivas.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ శ్రీనివాస్పై తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ రాణిగంజ్ బుద్ధ భవన్లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లిన కరీంనగర్కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అఘోరి శ్రీనివాస్ తనను పెళ్లి పేరుతో వాడుకుని వదిలేశాడంటూ కమిషన్ ఎదుట భాదితురాలు వాపోయింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, వర్షిణి అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
అమాయక మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అఘోరీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. పెళ్లైన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని అఘోరీ బెదిరిస్తున్నాడని వాపోయింది. తనలాంటి మహిళలు చాలా మందిని అతను మోసం చేశాడని, అందరూ ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె కోరింది. తన వద్ద డబ్బులు తీసుకుని మానసికంగా హింసించాడని చెప్పింది. నగ్నపూజలు చేయిస్తానని చెప్పి నగదు తీసుకుని మోసం చేశాడని బాధితురాలు చెబుతోంది. కాగా, రూ.9.08 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. 308, 301, 351, 352 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టారు.
మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు, అన్నలు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. వర్షిణినీ అఘోరి శ్రీనివాస్ నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. అతని చెర నుంచి తమ కుమార్తెను ఎలాగైనా కాపాడి అప్పగించాలని బాధితులు కోరారు. కాగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్లో అఘోరీ శ్రీనివాస్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా అతని ఆగడాలను అరికట్టాలని పలువురు తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు ప్రభుత్వాలను కోరుతున్నారు.