- Advertisement -
నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి పొందాలి…జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Should be self employed with skill development...District Collector Muzammil Khan
కరుణగిరి బైపాస్ రోడ్ లోని కారుణ్య కమ్యూనిటీ సెంటర్ లో నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం:
నైపుణ్యాభివృద్ధితో స్వంత బలం మీద ఉపాధి పొందడమే కాక పది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ముంపు ప్రాంత వాసులకు స్వయం ఉపాధికి ఆర్సిఎం బిషప్ సగిలి ప్రకాష్ ఆధ్వర్యంలో కరుణగిరి బైపాస్ రోడ్ లోని కారుణ్య కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటుచేసిన నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరదలతో ఎన్నో బాధలు పడి, ధైర్యంగా నిలదొక్కుకున్నామన్నారు. నైపుణ్య కార్యక్రమం ద్వారా జీవన రీతిని, పద్ధతిని మార్చుకోనుటకు అవగాహన కలుగుతుందన్నారు. మహిళలు కుట్టుమిషన్, హోమ్ నర్సింగ్, ఇస్తరాకులు, కప్స్, క్యాండీల్స్, అగరవత్తుల తయారీ, బ్యూటీషియన్ తదితరాల్లో నైపుణ్యం పొంది, స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలన్నారు. మనం అభివృద్ధి చెందినప్పుడే కుటుంబాలు, సమాజం, గ్రామం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అందరూ బాగుంటే, నేనూ బాగుంటాను అనే భావన రావాలన్నారు. కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.
నైపుణ్య కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమానికి వచ్చిన మహిళలను సమస్యల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వరదల్లో ఇండ్లు కొట్టుకుపోవడం, తీవ్ర నష్టం వాటిల్లడం జరిగిందని, ఇండ్ల నిర్మాణానికి మహిళలు కోరగా, ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్నట్లు, మొదటి విడతగా స్థలాలు ఉన్న వారికి పథక లబ్ది చేకూర్చనున్నట్లు, దశల వారిగా అర్హులందరికి ఇండ్లు మంజూరులు జరగనున్నట్లు తెలిపారు. కాలనీల్లో రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పన కు చర్యలు చేపట్టనున్నట్లు అన్నారు.
అనంతరం రాజీవ్ గృహకల్ప సమీపంలో ఉన్న మదర్ థెరిస్సా ఓల్డ్ ఏజ్ హోమ్ ను సందర్శించారు. ఆశ్రమంలో అనాధలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు . వరదల వల్ల దెబ్బతిన్న భవనాలు పరిశీలించారు. నీరు సాఫీగా వెళ్లిపోయేలా కార్యాచరణ చేయాలన్నారు. నష్టానికి ప్రభుత్వం నుండి సహకారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ తహసిల్దార్ రాంప్రసాద్, ఫాదర్ తప్పేట శౌరీ వికార జర్నల్, ఫాదర్ మాధ్యు వరప్రసాద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



