బద్వేల్ లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం దిశగా అడుగులు
Steps towards former glory of Telugu Desam Party in Badvel
ప్రత్యేక వ్యూహరచనతో ముందుకు సాగుతున్న టిడిపి నేతలు
బద్వేలు,
బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టిడిపి బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి లు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేక ప్రణాళికతో ఎప్పటికప్పుడు ఆయా మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతూ పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి మండలంలో ను, గ్రామాల్లోను దీటుగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా విద్యా కమిటీ చైర్మన్ ల ఎంపికలో తమదైన శైలిలో వ్యూహ రచన గావించారు. రితీష్ రెడ్డి తన తాత వీరారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వింటూ పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. వైసిపి హయాంలో జరిగిన కబ్జాలను వెలికి తీసే దిశగా చర్యలు చేపడుతూ మరోవైపు తెలుగుదేశం పార్టీకి గౌరవం పెంచేదిశగా కార్యకర్తలు నడవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే వస్తున్నారు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన తాను ముందు ఉంటానంటూ.. చేపడుతున్న చర్యల్లో భాగంగా ఏర్పడుతున్న పలు అపోహలను తుడిచిపెట్టే దిశగా రితీష్ రెడ్డి కార్యాచరణను చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి గాను తల్లి విజయమ్మ తో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ గ్రామస్థాయి నుంచి టిడిపిని బలోపేతం చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా బూతు స్థాయిలో కూడా పార్టీ సభ్యత్వాన్ని పెంపొందించేలా బూత్ కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు. జిల్లాస్థాయిలో సభ్యత్వ నమోదులో బద్వేలును కూడా ముందువరుసలో ఉండేలా చేస్తూ ..మరోపక్క నీటి సంఘాల చైర్మన్ల ల గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరుపుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కళకళలాడుతున్నదని పార్టీ అభిమానులు పేర్కొంటున్నారు.
కూటమి నాయకులను సైతం కలుపుకొని ముందుకు సాగుతున్న రితీష్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో.. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని సొంతం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ఇప్పటినుంచే కొనసాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు



