- Advertisement -
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీం వార్నింగ్
Supreme warning to MLAs who switched parties
హైదరాబాద్, ఫిబ్రవరి 1, (వాయిస్ టుడే)
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వేసిన అనర్హతా పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా అంటూ అసహనం ప్రదర్శించింది. అయితే ఎంత కాలం పడుతుందా అన్నదాదనిపై తాను స్పీకర్ ను అడిగి నిర్ణయం చెప్తాననని ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి, తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మందిపై అనర్హతా వేటు వేయాలని రెండు వేర్వేరు పిటిషన్లను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసారు. పోచారం, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆ మేరకు తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేమని, ఎటువంటి గడువు విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరపున ఈ పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వారిని అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ కార్యదర్శి హైకోర్టు ప్రత్యేక బెంచ్ను ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉందని, దీనికి కాలపరిమితి లేదని ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే, స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ హైకమాండ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇలాంటి పిటిషన్లపై నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్ కు మాత్రమే ఉందని.. కోర్టులు ఆదేశించలేవని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. తదుపరి విచారణలో స్పీకర్ ఏం చెబుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
- Advertisement -