అందరినీ ఓడ గొట్టి ఒక్కడివే గెలుద్దాం అనుకుంటున్నావా…..
గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి చలి కాగుతారా
మీరు మంత్రా…..వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేనా
మీ ఖమ్మం నియోజకవర్గం మీరు చూసుకోండి
నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటి
ఎవరిది వారు కడుక్కుంటే మంచిది
సామంత రాజులా వ్యవహరిస్తున్న మంత్రి
తప్పుడు రిపోర్టులతో టికెట్ రాకుండా చేసింది మీరు కాదా
రాజకీయంగా నన్ను తొక్కాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పై ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

జిల్లాలో అందరి మధ్య కొట్లాట పెట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను అందరిని ఓడగొట్టి నీవు ఒక్కడివే గెలవాలనుకుంటున్నావా అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఘాటు విమర్శలు చేశారు. రాజకీయంగా తనను తొక్కాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని మంత్రిని ఎమ్మెల్యే హెచ్చరించారు. వైరా లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో శుక్రవారం వైరా నియోజకవర్గ స్థాయి బి ఆర్ ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ఎంపిక చేసిన దళిత బంధు జాబితా కాకుండా ప్రస్తుత బీఆర్ఎస్ వైరా అభ్యర్థి బానోత్ మదన్ లాల్ తయారుచేసిన జాబితాను అధికారులు పరిగణలోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది . దీంతో వైరాలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ మంత్రి పువ్వాడ పై ఫైర్ అయ్యారు. వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రసంగించారు. ఒక వైపు తన ఆవేదనను తెలుపుతూనే…… మరోవైపు మంత్రిపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఎవరిది వారు కడుక్కుంటే మంచిదని హితువు పలికారు. సీఎం కేసీఆర్ రాజులా , కేటీఆర్ యువరాజులా రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుంటే సామంతురాజు మాత్రం ఎక్కువ చేస్తున్నారని మంత్రిపై ద్వజమెత్తారు. మీరు మాకు మంత్రిగా ఉన్నారా….. వైరా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను గౌరవించాలని తెలియదా అంటూ మండిపడ్డారు. ప్రోటోకాల్ ను అగౌరవ పరుస్తూ తనను ఎందుకు మానసికంగా వేధిస్తున్నారంటూ ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలు జరిగి కౌంటింగ్ ముగిసే వరకు తాను వైరా ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలన్నీ ఎమ్మెల్యేల చేతుల మదుగా అమలు చేస్తుంటే వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే నైన తనను ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు ఇంత వంకర ఆలోచనలు చేస్తున్నారని ప్రశ్నించారు. తనను కాదని బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ ఇచ్చిన దళిత బంధు జాబితా పై మంత్రి ఎండార్స్ చేసి అధికారులకు పంపారని చెప్పారు. వైరా నియోజకవర్గంలో గ్రూపులు ఎవరు కడుతున్నారో తేల్చి చెప్పాలన్నారు.

ఈ ఆలోచన తన భావ మదన్ లాల్ కు పుట్టిందో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. మీ ఖమ్మం నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి…. మా నియోజకవర్గంలో వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. తప్పుడు సర్వేలతో తనను కాదని వేరొకరికి మంత్రి టికెట్ ఇప్పించారని ఆరోపించారు. మీరు టికెట్ ఇప్పిస్తే ఇప్పించుకోండని, ఇప్పుడు టికెట్ వచ్చిన అభ్యర్థి కూడా గిరిజనుడు నేనని, తన భావేనని ఆయనను 100 శాతం గెలిపిస్తామని స్పష్టం చేశారు. గిరిజనులైన మా ఇద్దరి మధ్య చిచ్చురేపి కొట్లాటలు పెట్టి గ్రూపులు ఏర్పాటు చేసి ఆ మంటల్లో చలి కాగుదామనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యేగా రాజ్యాంగం బాధ్యతలు కల్పించిందని స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన తాను తెల్ల కాగితం, గుండు పిన్ను కూడా ఆశించకుండా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతిపక్షాల నుంచి ఎలాంటి నిరసన లేకుండా నిబంధనలకు అనుగుణంగా పనిచేశానని పేర్కొన్నారు. టిక్కెట్ రాకపోయినా తనను తానే ఓదార్చుకొని పార్టీ అభివృద్ధి కోసం, అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నానన్నారు. తనకు ఎవరితో కక్షలు, కారుపుణ్యాలు లేవని, నియోజకవర్గంలో ఎప్పుడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. తాను, తన బావ మదన్ లాల్ కలిసి పార్టీ అభివృద్ధికి పనిచేస్తుంటే చిచ్చు ఎవరు ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. తాను 1100 దళిత బంధు యూనిట్లను బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల ద్వారానే లబ్ధిదారుల జాబితాను రూపొందించానన్నారు. ఈ జాబితా తయారుచేసిన ప్రజా ప్రతినిధులు, నాయకులు బిఆర్ఎస్ వాళ్ళు కాదా అని ప్రశ్నించారు. తనను ఎంత అవమానించినా, వేధించినా సీఎం కేసీఆర్ బాటలోనే నడుస్తానని, మదన్ లాల్ గెలుపుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గంలోని బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.