లగచర్ల బాధితులను కలిసిన జాతీయ ఎస్టీ కమిషన్

- Advertisement -

లగచర్ల బాధితులను కలిసిన జాతీయ ఎస్టీ కమిషన్

The National ST Commission met the victims of Lagacharla

పేదల ఉసురు వద్దు రేవంత్
మహబూబ్ నగర్, నవంబర్ 18, (వాయిస్ టుడే)
సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులతో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ మాట్లాడారు. రైతులను పరామర్శించారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమంటూ.. ఎనిమిది నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని ఎంపీలు వ్యాఖ్యానించారు. బలవంతంగా భూములు లాక్కుంటామంటేనే రైతులు ఆగ్రహించారని చెప్పారు.’లగచర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం. ఘటనలో కాంగ్రెస్‌కు చెందినవారిని వదిలేశారు. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలి. రేవంత్‌కు ప్రజల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా. రేవంత్‌ కొడంగల్‌ వాసి కాదు.. వలస వచ్చారు. కాంగ్రెస్ వాళ్లే ఈ దాడులు చేయించారు. ఈ ఘటనపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ వేస్తాం. బడా కంపెనీలకు భూములు అప్పజెప్పడం వెనుక మతలబేంటి.. రియల్ఎస్టేట్ కోసం భూములు ఇస్తే ఊరుకోం’ అని బీజేపీ ఎంపీలు స్పష్టం చేశారు.అటు లగచర్ల ఫార్మా బాధితులు ఢిల్లీకి వెళ్లారు. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల సంఘానికి, ఎస్సీ కమిషన్‌కు, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వీరివెంట మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. లగచర్ల ఫార్మా బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు మహిళా కమిషన్‌ను కోరారు.కాంగ్రెస్, బీజేపీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్‌ఎస్‌ పాలన ఎలా ఉందో కాంగ్రెస్‌ పాలన కూడా అలాగే ఉంది. ఏ మాత్రం మార్పు రాలేదని ప్రజలు బాధపడుతున్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగదు. వ్యక్తులను విమర్శించడమే రాజకీయంగా మారిపోయింది. ఈ రెండు పార్టీల వల్ల రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. బీఆర్ఎస్‌ సుద్దపూస అయినట్టు ఇప్పుడు మాట్లాడుతోంది’ అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.మరోవైపు లగచర్ల దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం లగచర్ల, రోటిబండ, పులిచర్లకుంటలో సాధారణ పరిస్థితులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు సురేష్‌ ఇంకా పరారీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. సురేష్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ప్రభుత్వం తమ వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని.. బాధిత రైతు, గిరిజన కుటుంబాల సభ్యులు ఆరోపించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్యను ఇటీవల కలిసి ఫిర్యాదు చేశారు. మణిపుర్‌లో మహిళలపై దాడి జరిగితే రాహుల్‌ గాంధీ వెళ్లి పరామర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని, లగచర్లకు కూడా ఆయన రావాలని డిమాండ్‌ చేశారు.
అల్లుడి కోసం ఆరాచకమా
శాంతి భద్రతల వైఫల్యం వల్లే వికారాబాద్ జిల్లాలో లగచర్ల ఘటన జరిగిందని బిజెపి ఎంపి డీకే అరుణ అన్నారు. లగచర్ల కంపెనీకి భూసేకరణ కోసం రైతులు నిరాకరించారని ఆమె చెప్పారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టు అయి సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 16 మందితో బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తో కలిసి డీకే అరుణ ములాఖత్ అయ్యారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీ వద్దని గత 8 నెలలుగా రైతులు దీక్షలు చేస్తున్నారని.. కానీ, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి యత్నించారని ఎంపీ ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజావేదికను గ్రామస్థులు బహిష్కరించారని తెలిపారు. లగచర్ల ఘటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. తాజాగా ఈ అంశంపై డీకే అరుణ మాట్లాడుతూ, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని గత 8 నెలలుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని చెప్పారు. రేవంత్ రెడ్డి సోదరుడు అక్కడున్న రైతులను భయపెట్టారని, ఎలాగైనా భూములను గుంజుకుంటామని చెప్పారని మండిపడ్డారు. కలెక్టర్ పై దాడి ఘటన తర్వాత గ్రామాల్లోకి వచ్చిన పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదని… వారు వలస వచ్చారని డీకే అరుణ చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే తమ నియోజకవర్గం బాగుంటుందని ప్రజలు గెలిపిస్తే… ఆయనేమో జనాలపై కక్ష కట్టారని దుయ్యబట్టారు. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంతాలకు పోవద్దని, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని సూచించారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం లేకుండా కలెక్టర్‌ ఒక్కరే గ్రామానికి వెళ్లారని.. అక్కడికి వచ్చిన కలెక్టర్‌ను గో బ్యాక్‌ అని ప్రజలు నిరసన తెలిపారని చెప్పారు. ఈ క్రమంలోనే ఘటన చోటుచేసుకుందని ఎంపీ డీకే అరుణ అన్నారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని… 11 నెలల సమయంలోనే మీరు పేదల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అహంకారాన్ని వీడాలని చెప్పారు. రైతులను ఒప్పించిన తర్వాతే భూములు తీసుకోవాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular