లక్షన్నర కోళ్లను చంపడమే పరిష్కారం
మెదక్ ఏప్రిల్ 11, (వాయిస్ టుడే
The solution is to kill one and a half million chickens.
తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. నిన్నమొన్నటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో వేలాది కోళ్లు చనిపోయాయి. ఫౌల్ట్రీ పరిశ్రమల్లో కోళ్లు చనిపోవటంతో ఆ ప్రాంతాల్లో వెటర్నరీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరీక్షలను సేకరించి ల్యాబ్ కు పంపించగా బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్లు మరణించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పలు పౌల్ట్రీ ఫామ్ లను అధికారులు సీజ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.సిద్ధిపేట జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగింది. తోగుల మండలం కాన్గల్ లోని లేయర్ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో వెటర్నరీ డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగింది. ఫామ్ లో ఐదు షెడ్లలో ఉన్న మొత్తం 1.45లక్షల కోళ్లను చంపి పూడ్చి పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా పది టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్ లో ఒక వెటర్నరీ డాక్టర్, ఇద్దరు కాంపౌండర్లు, ఇద్దరు అటెండర్లను నియమించారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ఫామ్ లోకి వెళ్లి కోళ్లను చంపే పనిని మొదలు పెట్టారు.కాన్గల్ గ్రామం పరిధిలోని ఫౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ గ్రామంలో మొత్తం 512 కుటుంబాలు, 2,400 జనాభా ఉండగా.. ఆశా వర్కర్లు బుధవారం 150 ఇండ్లలో సర్వే చేశారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి, జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. మరో రెండ్రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తిచేసి అకస్మాత్తుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించనున్నారు.మెదక్ జిల్లాలో 44 లేయర్, బ్రాయిలర్ ఫామ్స్ ఉన్నాయి. వీటిల్లో 60లక్షల వరకు కోళ్లు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం కాన్గల్ గ్రామం పరిధిలోని పౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. అయితే, ఆ గ్రామం పరిసరాల్లో ఐదు పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి. ఇందులో సుమారు లక్ష కోళ్లను పెంచుతున్నారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన ఫామ్ కు కిలో మీటర్ పరిధిలో ఉన్న ఫామ్స్ లో ఉన్న కోళ్లను చంపేస్తామని అధికారులు చెబుతుండటంతో పౌల్ట్రీ రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు