ముంపు ప్రాంతాల్లో దొంగల హల్ చల్
Thieves are rampant in flooded areas
ఇంకా తీరని కష్టాలు
విజయవాడ
బుడమేరు వరదల నేపథ్యంలో విజయవాడలో ముంపు ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో యదేచ్చగా ఇళ్ల దోపిడీలు జరుగుతున్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్ళను దుండగులు దోచుకుంటున్నారు. ఇళ్లలో ఎవరు లేకపోవడంతో తాళాలు పగలగొట్టి అందిన కాడికి సామాన్లు పట్టుకు పోతున్నారు. వారం రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఇళ్ళ నుంచి బయటకు వచ్చి కొందరు రోడ్లపైనే ఉంటున్నారు. మరి కొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లు , మరికొందరు బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోయారు.
ఈ నేపథ్యంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను పగలగొట్టి సామాన్లు పట్టుకు పోతున్నారు. చాలా ప్రాంతాల్లో జన సంచారం లేకపోవటంతో దొంగలు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. నగరంలోని సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరి పేట, ఓల్డ్ రాజరాజేశ్వరి పేట, వాంబే కాలని ప్రాంతాల్లో ఈ తరహా ఘటన చోటు చేసుకుంటున్నాయి. వరద తగ్గకపోయినా ట్యూబుల సాయంతో పడవలు తయారు చేసుకొని తాళం వేసి ఉన్న ఇళ్ళను గుర్తించి దోపిడీలు చేస్తున్నారు . అసలే వరద ముంపుతో తీవ్ర నష్టానికి గురై కట్టుబట్టలతో మిగిలిన వారికి మరింత నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయ చర్యలో నిమగ్నమై ఉండటంతో ఇళ్లను చూసే పరిస్థితులు లేవు. గత వారం రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు నీటిముంపులో ఉన్నాయి .
ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రెండు అడుగుల లోతులో వరద నీరు ఉంది . వారం రోజులుగా నగరంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా లేదు. వరుసగా రెండుసార్లు బుడమేరు ముంపు రావడంతో వేల సంఖ్యలో కుటుంబాలు నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాయి. నగరంలోని బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఇళ్లన్నీ ముంపుకు గురయ్యాయి. మరోవైపు ప్రధానంగా రోడ్లపై ఉంటున్న వారికి మాత్రమే ప్రభుత్వ సహాయం అందుతుంది కాలనీలో లోపలి భాగాలు ఇరుకు సందుల్లో ఉంటున్న వారికి ఎలాంటి సాయం అందటం లేదు. కనీసం తాగడానికి నీరు కూడా ఉండటం లేదని జనం వాపోతున్నారు.



