హైదరాబాద్, అక్టోబరు 31, (వాయిస్ టుడే ): తెలంగాణ బీజేపీ- జనసేన పొత్తుపై రగడ ప్రారంభమయింది. ఈ పొత్తులో భాగంగా జనసేనకు ఏ స్థానం ఇస్తారు.. ఎవరిపై సీటుకు ఎసరు వస్తుందో అన్న భయందోళనలలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి, కూకట్పల్లి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీంతో వేరువేరుగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నేతలు సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి టికెట్ జనసేనకు ఇవ్వడమనేది కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన శేరిలింగంపల్లి టికెట్ రవి యాదవ్కు వచ్చేలా పావులు కదుపుతూ బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అయినట్లు తెలిసింది.శేరిలింగంపల్లి టిక్కెట్ ను జనసేనకు కేటాయిస్తున్నట్లు గాప్రచారం జరుగుతోందని దీనిపై స్పందించాలని ఓ కార్యకర్త ..సోషల్ మడియాలో ఎంపీ దర్మపురి అరవింద్ ను ప్రశ్నించారు. అయితే తనకు తెలిసి అలాంటిదేమీ లేదని.. అక్కడ రవి యాదవ్ మంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారని ఆయన విజయం సాధిస్తారని పేర్కొన్నారు.కూకట్ పల్లి టికెట్ జనసేనకు ఇస్తారని తెలియడంతో టికెట్ ఆశించిన మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన అనుచరులు ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. పొత్తులో భాగంగా కూకట్పల్లి అసెంబ్లీ టికెట్ను జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దన్నారు. కూకట్పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించడమంటే బీఆర్ఎస్ను గెలిపించడమేనని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఇంకా కొలిక్కి రాలేదు. రెండు పార్టీల మద్య చర్చలు జరుగుతున్నట్లుగా కూడా స్పష్టత లేదు. గతంలో ఓ సారి పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. తర్వాత ఢిల్లీలో వీరిద్దరూ కలిసి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. పవన్ కల్యామ్.. కుటుంబ కార్యక్రమం కోసం ఇటలీ వెళ్లారు. మరో వైపు మూడో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనసేనకు పన్నెండు స్థానాలు కేటాయిస్తారంటూ.. సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. అందులో ఉన్న నియోజకవర్గాల కు చెందిన నేతలు.. ఆందోళనకు గురవుతున్నారు. తమ స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొద్దంటున్నారు. జనసేన తెలంగాణలో 32 స్థానాలకు పోటీ చేయాలని తొలుత నిర్ణయించింది. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు కిషన్రెడ్డి, లక్ష్మణ్ మద్దతు కోసం నేరుగా జనసేనాని పవన్ తో చర్చలు చేసారు. బీజేపీ అధినాయకత్వంతో చర్చల తరువాత నిర్ణయం తీసుకుందామని పవన్ ప్రతిపాదించారు. ఢిల్లీలో పవన్ నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటంతో బీజేపీ – జనసేన కలిసి ఎన్నికల్లో పని చేయాలని అమిత్ షా నిర్దేశించారు. సీట్ల గురించి కలిసి నిర్ణయానికి రావాలని సూచించారు. కానీ, ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు.క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీలోనూ టికెట్ల కేటాయింపు చిచ్చు రేపింది. నర్సాపూర్ టికెట్ను ఈ మధ్యే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్కు కేటాయించింది. టికెట్ ఆశించిన గోపి ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అనుచరులతో కలిసి వచ్చి హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ధర్నాకు దిగారు. భూకబ్జాదారులకు టికెట్ ఇస్తారా అని నినాదాలు చేశారు. క్యారెక్టర్ లేని వ్యక్తికి టికెట్ కేటాయించారని గోపి ఆరోపించారు. 27 ఏళ్లుగా తాను పార్టీ కోసం కష్టపడుతున్నానని తెలిపారు.మరో వైపు పొత్తు పేరు చెప్పి కూకట్పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించవద్దని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిరసనకు దిగారు. కూకట్పల్లి గడ్డ- బీజేపీ అడ్డా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కార్యాలయంలో కూర్చొని నిరసనకు దిగారు. కూకట్పల్లిలో అధికార బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వగల సత్తా బీజేపీ కి మాత్రమే ఉందని ఆ నియోజకవర్గం నేతలంటున్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపితే తాము కచ్చితంగా గెలిపిస్తామని పార్టీ నేతలకు తెలిపారు. తెలంగాణలో పోటీకి ఆసక్తి చూపుతున్న జనసేన – జీహెచ్ఎంసి పరిధిలో కూకట్పల్లి, శేరిలింగంపల్లి స్థానాలు కోరుతోంది.మొత్తానికి ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీల్లో టికెట్ టెన్షన్ కనిపిస్తోంది. టికెట్పై గంపెడాశాలు పెట్టుకున్న నేతలు తమ ఆశలు అడియాసలు కావడంతో పార్టీ నాయకత్వాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.



