అలిపిరి నుండి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుండి ఎలాంటి ముప్పు లేదని అటవీ శాఖ అధికారులు ధృవీకరిస్తేనే 12 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో చైర్మన్ క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు , కాఫీ , టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గోగర్భం సర్కిల్ నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు. పెరటాశి మాసం, సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. క్యూ లైన్లు 4 నుండి 5 కిలో మీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి భక్తులకు త్వరిత గతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పం తో వి ఐ పి బ్రేక్ , సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు చైర్మన్ చెప్పారు. క్యూ లైన్లలో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని చెప్పారు . అక్టోబరు 15నుండి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటుంటున్నామని తెలిపారు.




