కమలం గూటికి విజయసాయిరెడ్డి
విశాఖపట్టణం, మార్చి 7, (వాయిస్ టుడే )
Vijayasai Reddy to the lotus flower
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీతో పాటు తన ఎంపీ పదవికి కూడా హఠాత్తుగా రాజీనామా చేశారు. ఇక తాను రాజకీయాలకు దూరమని హార్టికల్చర్ చేసుకుంటానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన రాజీనామా చేసి కొన్నాళ్లు కనిపించకుండా పోయారు. ఈ మధ్యలో ఆయన కొన్ని రహస్య సమావేశాలు నిర్వహించారు. కానీ వివరాలు బయటకు రాలేదు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ను కూడా కలిశారు. కంది ఐఐటీకి వచ్చిన ఆయనకు ప్రోటోకాల్ లేకపోయినా ఆయన వద్దకు వెళ్లి మరీ ఆహ్వానించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆయనకు ఎందుకు అవకాశం వచ్చిందో మెల్లగా కన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. విజయసాయిరెడ్డి రాజకీయాలకు శాశ్వతంగా దూరం కాలేదు. ఆయన కొంత విరామం తీసుకోవాలనుకున్నారు. ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే మరో పార్టీలో చేరితే అనేక ప్రశ్నలు వస్తాయని అందుకే కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు అన్నీ మాట్లాడుకున్న తర్వాతనే రాజీనామా చేశారని ప్రస్తుతం ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఆయన బయటకు కనిపించకపోయినా..తెలియకపోయినా బీజేపీ పెద్దలతో నిరంతరం టచ్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. తాను రాజీనామా చేసిన రాజ్యసభ సీటును మళ్లీ ఆయన కోరుకోవడడం లేదు. పదవి లేకపోయినా పర్వాలేదు ఆయన బీజేపీలో చేరాలనుకుంటున్నారు. అందుకే తను రాజీనామా చేసిన స్థానంలో ఉపఎన్నిక జరిగిన వెంటనే ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటారని చెబుతున్నారు.ఇప్పటి వరకూ ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ లేదా జూలై నెలల్లో బీజేపీ తీర్థాన్ని పుచ్చుకునేందుకు విజయసాయిరెడ్డి రెడీ అయ్యారని అంటున్నారు. బీజేపీ పెద్దలు కూడా ఈ అంశంపై సానుకూలంగా ఉన్నారని.. అలా డీల్ మాట్లాడుకున్నందునే రాజీనామా చేశారని అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై కూటమి పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన తన పదవికి రాజీనామా చేసినప్పుడు టీడీపీ అధినేత చందర్బాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురించి చాలా పద్దతిగా మాట్లాడారు. వారిపై తాను చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయాల్లో భాగంగా చేసినవే తప్ప.. వ్యక్తిగతంగా తనకు వారితో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన ఏ2గా ఉన్నారు. అలాగే కాకినాడ పోర్టును బెదిరించి రాయించుకున్నారన్న కేసుల్లోనూ ఇటీవల ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇంకా అనేక స్కాముల్లో ఆయన పేరు ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలోఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు బీజేపీలోనే చేరాలనుకుంటున్నారు. ఆయనను చేర్చుకుంటారా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.