రుణమాఫీ కాని వారికి న్యాయం చేస్తాం
We will do justice to those who are not forgiven
హైదరాబాద్, ఆగస్టు 15,
రుణమాఫీ జరగని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు.. రైతులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రుణమాఫీ జరగని రైతుల కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేశామని.. రుణమాఫీపై ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ గోల్కండలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలమని.. సుదీర్ఘ పోరాట ఫలితమని తెలిపారు. జవహారల్ లాల్ నెహ్రూ సంస్కరణల వల్లే దేశం సస్యశ్యామలంగా ఉందని తెలిపారు. BHEL, IDPL, మిధాని వంటి పరిశ్రమలను స్థాపించి దేశ ఆర్థికాభివృద్ధికి పునాదులు వేశారని గుర్తు చేశారు. మాజీ ప్రధానులు లాల్బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వ్యవసాయంలో నూతన విప్లవాలు తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ దేశానికి ఎన్నో సేవలు చేసిందని తెలిపారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరిచారు. ఇప్పటికే రెండు విడతల మాఫీ అయిందని.. ఇవాళ మూడో విడత మాఫీ చేయనున్నట్లు తెలిపారు. రుణమాఫీ అసాధ్యమని కొందరు మాట్లాడారని.. కానీ తమ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి చూపిస్తుందని తెలిపారు. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ అందట్లేదని.. అలాంటి వారిని గుర్తించి తప్పకుండా అందజేస్తామన్నారు. అర్హులైనా.. రుణమాఫీ అందని వారి కోసం కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని.. ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
సైనిక వీరులకు నివాళి..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సైనిక వీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోని సైనిక అమరవీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.