కరీంనగర్, నవంబర్ 10, (వాయిస్ టుడే ): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల నియామకం పూర్తైంది. ఇతర పార్టీల అభ్యర్థులు గత నెల రోజులుగా ప్రచారాల్లో మునిగి తేలుతున్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయకపోవడంతో, ఒకింత అసహానానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు మూడో జాబితాలో కీలకమైన నియోజకవర్గాలైన సిరిసిల్ల, కరీంనగర్ అభ్యర్థులుగా కేకే మహేందర్ రెడ్డి, పురుమళ్ల శ్రీనివాస్ లను ప్రకటించగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపిన పేరును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్ జిల్లాలో అపారమైన అనుభవం ఉన్న నాయకులైన తాటిపర్తి జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీపడుతుండడంతో పాటు తమ టీమ్ ను గెలిపించి తమ సత్తా చాటాలని కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించి పాదయాత్రతో పాటు మేడిగడ్డను సందర్శించి పలువేదికలపై నుంచి కాంగ్రెస్ పార్టీ బలాబలాలను ప్రజలకు వివరించి ప్రచారం కొనసాగించారు.ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక అనేది బాగా చేశారనేది కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అసంతృప్తులను బుజ్జగిస్తూ, అభ్యర్థులుగా ప్రకటించిన వారి బలబలాలను అసంతృప్తులకు వివరిస్తూ ఇతర పార్టీల్లోకి వలస వెళ్లకుండా కట్టడి చేయడంలో సీనియర్ నాయకులు పెద్దన్న పాత్ర పోషించారనడంలో అతిశయోక్తి లేదు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు, ఆరు గ్యారంటీల పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ, కర్నాటక రాష్ట్రంలో మాదిరిగా విజయకేతనం ఎగురవేయడానికి కాంగ్రెస్ టీం కదనరంగంలోకి దిగింది.

దూకుడుగా ముందుకు సాగుతుండడంతో పాటు సీనియర్ల అండదండలు, రాహుల్ గాంధీ పర్యటనలు వెరసి కాంగ్రెస్ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల బలాబలాలు ఇలా ఉన్నాయి.సర్పంచ్ గా సుదీర్ఘ అనుభవంతో పాటు తన భార్య కరీంనగర్ జడ్పీటీసీగా చేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన పురుమళ్ల శ్రీనివాస్ కు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. సుమారు ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ప్రతిగ్రామంలో సత్సంబంధాలు ఉండడం, గంగుల కమలాకర్ తో విభేధాల దృష్ట్యా పురుమళ్ల శ్రీనివాస్ సరైన నాయకుడని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.తెలుగుదేశం పార్టీలో విశేష అనుభవం ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయరమణారావు గతంలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. రేవంత్ రెడ్డితో టీడీపీ నుంచి నేరుగా సత్సంబంధాలున్న నాయకుడిగా పేరుగాంచిన విజయరమణారావును రేవంత్ రెడ్డి ఆరునెలల క్రితమే ప్రకటించడం గమనార్హం.తండ్రి నుంచి వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకున్న శ్రీధర్ బాబుకు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలుశాఖల్లో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు నేరుగా రాహుల్ గాంధీతో మాట్లాడే స్థాయిలో ఉండడం, ఇతర నియోజకవర్గాల్లో ప్రచార స్టార్ క్యాంపెంయినర్ గా ఉన్న శ్రీధర్ బాబు మరోసారి విజయకేతనం ఎగురవేస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నియోజకవర్గానికే పరిమితమైన జీవన్ రెడ్డి పలువురు ముఖ్యమంత్రుల హయాంలో పనిచేసిన అనుభవం ఉంది. మంత్రిగా, ఎమ్మెల్సీగా, సీఎల్పీ నేతగా అనుభవం ఉన్న జీవన్ రెడ్డి ఈసారి జగిత్యాల నియోజకవర్గం నుండి బరిలో నిలుస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేయడం ఇదే చివరిసారి అంటూ ప్రజల్లోకి వెళ్తున్న జీవన్ కు విశేష ఆదరణ లభిస్తోంది.ఎన్ఎస్యూఐ నాయకుడి నుంచి ఎంపీ వరకు కాంగ్రెస్ పార్టీలో ఎదిగి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించిన పొన్నం ప్రభాకర్ ఈసారి హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. గౌడ సామాజిక వర్గం బలంగా ఉన్న హుస్నాబాద్ పై తనకు ఎంపీగా పనిచేస్తున్న తరుణంలో ఉన్న పట్టుతో ఈ సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని ప్రక్కన పెట్టి మరీ….పొన్నం పేరు ప్రకటించడంతో అందరి దృష్టి హుస్నాబాద్ పైనే ఉందని చెప్పవచ్చు.రామగుండం-రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ధర్మపురి-అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం, ధర్మపురి, కోరుట్ల-జువ్వాడి నర్సింగరావు, వేములవాడ-ఆదిశ్రీనివాస్, సిరిసిల్ల-కేకే మహేందర్ రెడ్డి, చొప్పదండి-మేడిపల్లి సత్యం, మానకొండూరు-కవ్వంపల్లి సత్యనారాయణలకు గతంలో పలు పార్టీలపై పోరాడిన అనభవంతో పాటు, ప్రజల్లో సానుభూతి, నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉండడంతో పాటు పలు అంశాలు కలిసివచ్చే పరిస్థితులు కనబడడంతో, ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన అభ్యర్థుల జాబితాను వడపోసి మరీ ఈ అభ్యర్థులను ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గం నుంచి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న వొడితెల రాజేశ్వర్ రావు మనవడైన వొడితెల ప్రణవ్ బాబు పేరు ప్రకటించారు. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరిని విజయం వరిస్తుందో వేచిచూడాల్సిందే.



