అరూరికి ఎదురుగాలి..

- Advertisement -

నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు
సొంత పార్టీ నేతల నుంచే ప్రతికూలత
అభివృద్ధి అంతంత మాత్రమేనని ఆరోపణలు

వరంగల్:  అరూరి రమేష్‌ తెలంగాణలోనే అత్యంత మెజారిటీతో గెలుపొందిన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు.  వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన అరూరి ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధించేందకు తన వ్యూహాలకు పదును పెట్టారు. అయితే అరూరి హ్యాట్రిక్‌ సాధిస్తాడా..? హ్యాట్రిక్‌ ఆశలకు గండి పడబోతోందా…? బీఆర్‌ఎస్‌కు వర్థన్నపేట ప్రజలు బ్రహ్మరథం పడతారా..? ఈ సారి ఓటమిని చూపిస్తారా..? బీఆర్‌ఎస్‌లోని అంతర్గత కుమ్ములాటలు వర్ధన్నపేట ఎన్నికపై ప్రభావం చూపనుందా..?

వర్ధన్నపేట నియోజకవర్గానికి ప్రత్యేక రాజకీయ చరిత్ర ఉంది. 1957 నుంచి 2004 వరకు జనరల్‌ నియోజకవర్గంగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009 ఎన్నికల నుంచి ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారింది. జనరల్‌గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక్కరే ఇప్పటి వరకు హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. పునర్విభజన అనంతరం ఎస్సీకి రిజర్వ్‌ కావడంతో 2004లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా కొండేటి శ్రీధర్‌ గెలిచారు. తర్వాతి ఎన్నికలు 2009, 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అరూరి రమేశ్‌ గెలుపొందారు. ఈ సారికూడా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించి ఎర్రబెల్లి దయాకర్‌రావు రికార్డును సమం చేయాలనుకుంటున్నారు.
అరూరి రమేశ్‌ 2009లో ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ పార్టీ నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో చేరి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటి చేసి గెలుపొందారు.  2018 జరిగిన ఎన్నికల్లోనూ గెలుపొంది, 2022 నుంచి బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
మూడో సారి కూడా బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ సాధించుకున్న తరుణంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని కొంత మంది బీఆర్‌ఎస్‌ నేతలు అరూరి రమేష్‌కు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టి, అరూరికి టికెట్‌ ఇవ్వొద్దని బహిరంగంగానే డిమాండ్‌ చేశారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే రమేష్‌ ఒంటెద్దు పోకడతో తాము విసిగి పోయామని, కార్యకర్తలకు, నాయకులను పట్టించుకున్నా పాపాన పోలేదని వారు మీడియా ముఖంగా ఎమ్మెల్యేపై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో అరూరి రమేష్‌కే టికెట్‌ కేటాయించారు. అసంతృప్తులను బుజ్జగించింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం.
నివురు గప్పిన నిప్పులా కార్యకర్తలు
రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందడానికి అహర్నిషలు పనిచేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల్లో ఈ సారి అరూరి రమేష్‌పై వ్యతిరేక పవనాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. బయటికి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుని తనచుట్టూ ప్రచారంలో ఉన్నప్పటికీ లోలోపల మాత్రం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమినే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం కార్యకర్తలు, నాయకుల్లో మాత్రమే కాకుండా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రజల్లో కూడా వ్యతిరేఖ భావన ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పట్ల వ్యతిరేక భావన ఉండడం సహజమే కాని, ఇప్పుడు అది తాను గెలుపొందడానికి వీలు లేకుండా అధిక వ్యతిరేకత కనిపిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular