యాదగిరిగుట్ట : యాదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా పేరు మారుస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం ఆలయ సన్నిధిలో వెల్లడించారు. టెంకాయ కొట్టే స్థలాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ క్షేత్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, త్వరలోనే క్షేత్ర సందర్శనకు రానున్నట్లు విప్ తెలిపారు. నెల రోజుల్లోగా సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా కృషి చేస్తానన్నారు. కొండపై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామన్నారు. పది రోజుల్లో హాల్ నిర్మాణం చేయాలని సూచించారు. పూర్వం నుంచి ఈ క్షేత్రానికి ఉన్న పేరు మార్చడం సరికాదన్నారు. ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత ఈవో రామకృష్ణారావు, ధర్మకర్త నరసింహమూర్తి స్వాగతం పలికారు. దైవ దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ వై.సుధ పాల్గొన్నారు.