బెంగళూరు, అక్టోబరు 30, (వాయిస్ టుడే): కర్ణాటక రాజధాని బెంగళూరులోని వీరభద్ర నగర్లోని బస్ డిపోలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో దాదాపు పది బస్సులు దగ్ధమయ్యాయి. దాదాపు 50 బస్సులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. మంటలను అదుపు చేసేందుకు అనేక అగ్నిమాపక దళ వాహనాలు అక్కడకు చేరుకున్నారు. ఎగిసిపడుతున్న అగ్నికీలలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేందుకు ప్రయత్నించారు. బెంగళూరులోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో కొద్దిరోజుల క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగింది.బస్సులకు మంటలు అంటుకోవడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు రాకపోవడం విశేషం. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఖచ్చితమైన సమాచారం తెలియరాలేదు. కటింగ్, వెల్డింగ్ మిషన్ నుంచి నిప్పురవ్వ రావడంతో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అగ్నిమాపక అధికారి తెలిపారు.



