
రాజమండ్రి: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే భయం బీఆర్ఎస్లో వ్యక్తమవుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.విద్యుత్ సరపరా కోసం మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదన్నారు. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ కేసీఆర్పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. పదేళ్ల పాలనలో హైదరాబాద్లో కేసీఆర్ చేసిన అబివృద్ధి ఏమీ లేదని తెలిపారు. హైదరాబాద్ను ఆంధ్రా నేతలే ఎక్కువ అభివృద్ధి చేశారని మాజీ ఎంపీ చెప్పుకొచ్చారు.హైదరాబాద్లో విశ్వరూప మహాసభలో మోదీ పాల్గొన్నారని.. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మాదిగలను మరోసారి మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణలో మాదిగల ఓట్లు కోసం బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. మంద కృష్ణ బీజేపీకి మద్దతు ఇవ్వటంపై మాదిగల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. జగన్ ప్రభుత్వ సంస్థల్లోనే రిజర్వేషన్లు తీసేశారని.. ఏపీలో వైద్య కళాశాలల్లో జగన్ రిజర్వేషన్లు రద్దు చేసి సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. అంటరానితనం నిర్మూలన కోసం రాజకీయ పార్టీలు కృషి చేయాలని సూచించారు. దళితుల్లో పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులంతా ఒక్కటే అనే నినాదంతో దళితుల సింహగర్జన ఏర్పాటు చేయనున్నట్లు హర్షకుమార్ వెల్లడించారు.



