హైదరాబాద్, నవంబర్ 21, (వాయిస్ టుడే): సరిపోయింది… హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ను చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి’ – ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటుడు ఆహుతి ప్రసాద్ చెప్పిన డైలాగ్ ఇది! ఇవాళ ఉదయం నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ చూసిన మెగా ఫాన్స్ కొందరికి ఆ డైలాగ్ గుర్తు వస్తోంది. ఎందుకు? ఏమిటి? అని అసలు వివరాల్లోకి వెళితే…’లియో’లో తనకు, త్రిషకు మధ్య రేప్ సీన్లు ఉంటాయని ఆశిస్తే… అటువంటివి ఏవీ లేకపోవడంతో నిరాశ చెందినట్లు నటుడు మన్సూన్ అలీ ఖాన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. తెలుగు, తమిళం అని వ్యత్యాసాలు లేకుండా భాషలకు అతీతంగా త్రిషకు హీరోలు, నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అండగా నిలిచారు. మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి సైతం ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకు పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యమైన అంశాల్లో తమ గళం వినిపించని చాలా మందికి ఇవాళ సడన్గా మానవత్వం గుర్తుకు వచ్చిందని పూనమ్ కౌర్ ఓ పోస్ట్ చేశారు. తమ కీర్తి పెంచుకోవడానికి లేదా స్టేటస్ కోసం మహిళకు అండగా నిలబడకూడదని ఆమె పేర్కొన్నారు.

త్రిషకు మద్దతుగా మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నితిన్ ట్వీట్స్ చేశారు. నితిన్ సోమవారం స్పందించగా… చిరు ఈ రోజు (మంగళవారం) తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్ల, చిరును టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ ఈ ట్వీట్ చేశారని నెటిజనులు అభిప్రాయ పడుతున్నారు. ఓ నెటిజన్ అయితే… పూనమ్ ట్వీట్ కింద చిరును ట్యాగ్ చేసి రిప్లై ఇచ్చారు.
తోటి కథానాయికకు, సాటి మహిళకు అన్యాయం జరిగినప్పుడు అగ్ర హీరో స్పందిస్తే అభినందించడం పోయి… ఆయనపై పరోక్ష విమర్శలకు దిగడం తగదని కొందరు పేర్కొంటున్నారు. ఓ ఫ్యామిలీ హీరోలపై ప్రతిసారీ వ్యతిరేకత వ్యక్తం చేయడం ఆమె అలవాటుగా మారిందని ప్రేక్షకులు డిస్కస్ చేసుకుంటున్నారు. మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. మన్సూర్ మీద ఐపీసీ 509బి, ఇతర సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ‘లియో’ దర్శకుడు లోకేష్ కనగరాజ్, కథానాయికలు మాళవికా మోహనన్, మంజిమ మోహన్, గాయని చిన్మయి సహ పలువురు నటీనటులు మన్సూర్ అలీఖాన్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు.



