- Advertisement -
ఫోటోగ్రఫీలో హైదరాబాద్, త్రిపుర రాష్ట్రాలకు గొప్ప చరిత్ర ఉంది
-గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
Hyderabad and Tripura have a rich history in photography - Governor Jishnu Dev Verma
ఫోటోగ్రఫీలో హైదరాబాద్, త్రిపుర రాష్ట్రాలకు గొప్ప చరిత్ర ఉందని,
ఆ రోజుల్లో దేశంలో ప్రప్రథమంగా ప్రైవేట్ గా ఫోటో కెమెరాలు కొనుగోలు చేసిన ఘనత ఈ రెండు సంస్థానాలకే దక్కిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.
సోమవారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అనుబంధ సంఘమైన తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
వెయ్యి మాటల కన్నా ఒక్క ఫోటో ఎంతో గొప్పదన్నారు. పత్రికల్లో ఎన్నో వార్తలు ప్రచురితమైనా పాఠకుల దృష్టిని ఆకర్షించేది ఫోటోలు మాత్రమేనని జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. చరిత్రలో రికార్డుగా ఉండి పోయేది ఫోటోలే అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో పత్రికలకు ఆదరణ తగ్గి పోతుందని చర్చ జరుగుతుందని, కానీ ఇది తాత్కాలికం మాత్రమేనని, భవిష్యత్తు పత్రికలకే ఉంటుందని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టీయూడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కె.ఎన్.హరి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



