400 కోట్లతో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టు
హైదరాబాద్, మార్చి 11, (వాయిస్ టుడే )
‘Gandhi Sarovar’ Project at a Cost of ₹400 Crores
మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బాపూఘాట్ వద్ద రూ. 400 కోట్లతో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు సంబంధించిన డీపీఆర్ రెడీ అయింది. 150
మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహం, మ్యూజియం, ‘లండన్ ఐ’ తరహాలో చరఖా రంగుల రాట్నం ఈ ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణలు. మూసీ నదిపై 15 వంతెనలు, సైక్లింగ్ ట్రాక్లు, బోటింగ్, పర్యాటక హంగులను ఏర్పాటు చేస్తూ
డీపీఆర్ సిద్ధం చేశారు.హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రవహించే మూసీ నదిని అందంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మురుగు, వ్యర్థాలతో ప్రవహిస్తున్న మూసీ నదిని ప్రపంచ స్థాయి
పర్యాటక, ఆర్థిక కేంద్రంగా మార్చటమే లక్షంగా సర్కార్ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టింది. ఈ చర్యలో భాగంగా.. బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ను సైతం చేపడుతోంది. ఈ మేరకు తాజాగా మూసీ
రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డీపీఆర్ను సిద్ధం చేసింది. బాపూఘాట్ వద్ద 150 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహం నిర్మాణం కానుంది. మూసీ నదికి రెండు వైపులా విశాలమైన రోడ్లు, నది పొడవునా
ఆకట్టుకునే పార్కులు ఏర్పాటు కానున్నాయి.బాపూఘాట్ వద్ద ప్రభుత్వానికి 60 ఎకరాల భూమి భూమి ఉంది. ఇందులో 34 ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్లతో గాంధీ సరోవర్ ప్రాజెక్టు రాబోతుంది. 100 మీటర్ల
ఎత్తు వరకు పలు అంతస్తుల్లో టవర్ కట్టి అందులో సమావేశ గదులు, మ్యూజియం, గాంధీ చరిత్రపై ప్రదర్శనశాల, కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఈ టవర్పై 35-50 మీటర్ల ఎత్తున గాంధీ విగ్రహం
కొలువుదీరనుంది. గాంధీ విగ్రహం వెనుక లండన్ థేమ్స్ నది ఒడ్డున కనిపించే ‘లండన్ ఐ’ను పోలిన రంగుల రాట్నం ఏర్పాటు చేయనున్నారు. గాంధీ స్మృతుల్లో ఒకటైన చరఖాను తలపించేలా ఈ నిర్మాణం
కనిపించనుంది. పక్కనున్న 98 ఎకరాల డిఫెన్స్ భూములను సేకరించే ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉందని అధికారులు చెబుతున్నారు.మూసీలో నిత్యం మంచినీటిని ప్రవహింపజేయడంతోపాటుగా నదికి రెండు
వైపులా ఉన్న పరీవాహక ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. హిమాయత్సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు మెుత్తంగా 15 వంతెనలు నిర్మిస్తారు.
ఒకవైపు 100 అడుగుల రోడ్డు, మరోవైపు 80 అడుగుల రోడ్డు నిర్మించనున్నారు. దాంతో పాటుగా కాలిబాట, సైక్లింగ్ ట్రాక్, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు. నదిలో పూడికను తొలగించి, అంచులను సరిచేసి కొన్ని
ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేస్తారు. పిల్లల పార్కులు, హోటళ్లు, వేడుకలు నిర్వహించుకునేలా యాంఫీ థియేటర్లు ప్రాజెక్టులో భాగం కానున్నాయి. మూడు, నాలుగు చోట్ల చిన్నపాటి ఆనకట్టలనూ కూడా నిర్మిస్తారు.
గాంధీ సరోవర్లో బోటింగ్ సదుపాయం కూడా ఉండనుంది.



