విద్యార్థులకు అవసరమైన సామగ్రి జూన్ 15లోపు అందాలి – సీఎం రేవంత్ రెడ్డి
Essential materials for students must be delivered by June 15 – CM Revanth Reddy
కేంద్రీకృత కొనుగోలు విధానంతో పారదర్శకత – నాణ్యత, సమయపాలనపై కఠిన ఆదేశాలు
వాయిస్ టుడే :హైదరాబాద్
విద్యార్థులకు అవసరమైన అన్ని సామగ్రి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుస్తులు, నోటుపుస్తకాలు తదితర వస్తువులు సమయానికి అందితే విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారని తెలిపారు.
విద్యాశాఖతో పాటు బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన సామగ్రి సరఫరాపై సీఎం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. గతంలో శాఖలవారీగా కొనుగోలు, సరఫరా నిర్వహణలో ఏకరూపత లేకపోవడంతో పాటు అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిని అరికట్టేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుందని, అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, సరఫరాదారుల ప్రయోజనాల కోసం కాదని పేర్కొన్నారు.
విద్యార్థులకు అందజేసే నోటుపుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ నాణ్యమైనవే ఉండాలని ఆదేశించారు. నాణ్యతతో పాటు సకాలంలో సరఫరాపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు.
జూన్ 15 నాటికి అన్ని వస్తువులు విద్యార్థులకు చేరాలని, సరఫరా పూర్తయ్యగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి మండల స్థాయిలో నోడల్ అధికారిని నియమించి, గ్రామాల వారీగా పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పంపిణీ ప్రక్రియను ఫోటోలు, వీడియోల ద్వారా పర్యవేక్షిస్తూ, ప్రతి విద్యార్థికి అవసరమైన సామగ్రి అందిందా లేదా తనిఖీ చేయాలని తెలిపారు. అలాగే నాణ్యతపై విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు P. సుదర్శన్ రెడ్డి , ఎంపీ వెం నరేంద్ర రెడ్డి తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



