తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
క్లీన్ ఎనర్జీ తయారీ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దుతాం
Telangana is a paradise for investors: Deputy CM Bhatti Vikramarka
హైదరాబాద్, ఆగస్టు 18 (వాయిస్ టుడే): తెలంగాణను క్లీన్ ఎనర్జీ తయారీకి అంతర్జాతీయ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హెచ్ఐటెక్స్, నోవాటెల్లో నిర్వహిస్తున్న **‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ & ఎక్స్పో–2026’**ను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, సీఈఓలు, ఆవిష్కర్తలకు తెలంగాణకు రావాలని భట్టి విక్రమార్క ఆహ్వానం పలికారు. అన్ని రకాల పెట్టుబడులను ప్రోత్సహించే రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని, పెట్టుబడిదారులకు ఇది స్వర్గధామమని పేర్కొన్నారు.
విద్యుత్ ఉత్పత్తి విధానంలో మార్పు మాత్రమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థను మార్చే ప్రక్రియగా ఎనర్జీ ట్రాన్సిషన్ను ప్రభుత్వం చూస్తోందన్నారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ వినియోగదారుగా మాత్రమే కాకుండా, సౌర, విండ్, బ్యాటరీ తదితర క్లీన్ ఎనర్జీ సాంకేతికతల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
2030 నాటికి 20,000 మెగావాట్లు, 2035 నాటికి 26,000 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అలాగే బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 2030 నాటికి 3,800 మెగావాట్లు, 2035 నాటికి 8,000 మెగావాట్ల ఎనర్జీ స్టోరేజ్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ ఐటీ, ఏఐ సామర్థ్యాలను వినియోగించుకుని భవిష్యత్ విద్యుత్ గ్రిడ్ను డిజిటల్ నెట్వర్క్గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతిపాదిత ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏఐ డేటా సెంటర్ కోసం 100 మెగావాట్ల ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
అదేవిధంగా 2030 నాటికి ఏడాదికి 4 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, 2035 నాటికి 12,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణలో సౌర, పవన, బ్యాటరీ విడిభాగాల తయారీ సంస్థలకు మూలధన ప్రోత్సాహకాలు, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, విద్యుత్ డ్యూటీ మినహాయింపులతో పాటు TG-iPASS ద్వారా వేగవంతమైన అనుమతులు అందిస్తామని చెప్పారు.
ప్రభుత్వం, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతోనే ఈ ఇంధన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్న డిప్యూటీ సీఎం.. పారిశ్రామికవేత్తలు తెలంగాణతో కలిసి ఈ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం భట్టి విక్రమార్క ఎక్స్పోలోని వివిధ ప్రదర్శన స్టాళ్లను సందర్శించారు. ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.




