అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Centre denies permission for US visit… CM Revanth Reddy takes a key decision.
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగ పురోగతి, యువతకు అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలను కల్పించే ఉద్దేశంతో సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకే, అమెరికా పర్యటనకు ప్రణాళిక రూపొందించింది. నిబంధనలు, ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి కోరగా, తొలుత యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. ప్రతినిధి బృందం యూకే చేరుకున్న అనంతరం అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాజకీయ కారణాలతో అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్ నుంచే హైదరాబాద్కు తిరిగి రావాలని, బోస్టన్ పర్యటనను రద్దు చేసుకోవాలని నిర్ణయించారు.
ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను హైదరాబాద్కు తీసుకురావడమే లక్ష్యం
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశం ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను భారత్, తెలంగాణ, హైదరాబాద్కు తీసుకురావడమేనని తెలిపారు. ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు, ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న తెలంగాణ యువత ఆకాంక్షలకు ఈ భాగస్వామ్యాలు ఉపయోగపడేవని పేర్కొన్నారు.
దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు వంటి అంశాల్లో రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాలతో ఇప్పటికే జరిగిన సంప్రదింపులను కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs), భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్టీయూ వంటి విద్యాసంస్థలు నగరాన్ని మానవ వనరుల కేంద్రంగా మార్చాయని అన్నారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రపంచ స్థాయి టెక్ నాయకులు ఎదిగారని, ఐఐటీ, ఐఎస్బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ ప్రపంచ స్థాయి కార్పొరేషన్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించగలిగిందని తెలిపారు.
ప్రపంచంలోని ప్రముఖ విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్ను కేంద్రంగా మార్చి 21వ శతాబ్దపు తెలంగాణ ప్రగతి ప్రయాణానికి మరింత ఊతమిస్తామని సీఎం పేర్కొన్నారు.
యూకే పర్యటన కొనసాగింపు
అమెరికా పర్యటన రద్దయినప్పటికీ యూకే పర్యటన షెడ్యూల్ ప్రకారం కొనసాగనుంది. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు.
అలాగే యూకేలోని ప్రముఖ క్రీడా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి రంగ ప్రతినిధులతో చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్యాలను ఖరారు చేసేందుకు ప్రయత్నించనున్నారు.
హైదరాబాద్లోనే ప్రపంచ స్థాయి విద్య, సర్టిఫికేషన్ అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన సంకల్పమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. Harvard, Oxford, MIT, LBS, LSE వంటి సంస్థల స్థాయి విద్యా అవకాశాలను హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.




