తెలంగాణలో పనీర్పై ఏడాది నిషేధం
తయారీ నుంచి విక్రయం వరకు అన్ని దశల్లో బ్యాన్
One-year ban on paneer in Telangana
హైదరాబాద్: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణలో నాన్ డెయిరీ/ఆర్టిఫిషియల్ లేదా అనలాగ్ పనీర్పై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రతా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిషేధం పరిధిలో నాన్ డెయిరీ పనీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, పంపిణీ, హోల్సేల్, రిటైల్ విక్రయాలు ఉంటాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, ఫుడ్ సర్వీస్ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో ఇటువంటి పనీర్ను ఆహార తయారీలో వినియోగించడంపైనా నిషేధం వర్తిస్తుంది.
అంటే నాన్ డెయిరీ లేదా అనలాగ్ పనీర్ను తయారు చేయడం నుంచి వినియోగదారుడికి విక్రయించడం వరకు మొత్తం సరఫరా శ్రేణినే నిషేధం కవర్ చేస్తుంది. నిషేధిత ఉత్పత్తిని నిల్వ ఉంచడం లేదా విక్రయించడం కూడా ఉత్తర్వుల పరిధిలోకి వస్తుంది.
ఈ నిషేధానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ కాగా, ఉత్తర్వులు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఆహార భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.




