భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత..
హైదరాబాద్: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరుపై ఆ జిల్లా కార్యకర్తలు ఆందోళనకు దిగారు..
పార్టీ కార్యాలయంలో బైఠాయించి ఎంపీకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అర్వింద్ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ ఆర్మూర్, బాల్కొండ, బోధన్ మండలాలకు చెందిన కార్యకర్తలు నిరసన తెలిపారు. సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపీ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిన మండలాల అధ్యక్షులను తిరిగి నియమించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. అక్కడున్న పార్టీ నేతలు చెప్పినా వినిపించుకోని కార్యకర్తలు.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డే తమకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. చివరకు కిషన్రెడ్డితో సమావేశం ఏర్పాటు చేస్తామని పార్టీ నేతలు హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు..



