
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే పోరు
కాంగ్రెస్ బరిలో జీవన్ రెడ్డి?
బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కే టికెట్
జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ చైతన్యం, యువ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల అనే మాట సుస్పష్టం. చరిత్ర ఆనవాళ్లను పరిశీలిస్తే రాజకీయంగానూ ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీల మధ్య పోరు ఉంటుంది? అనే అంశాలపై విశ్లేషణాత్మక కథనం..

కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి
జగిత్యాల నియోజకవర్గం బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బరిలో నిలవడం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిచినప్పటికీ.. తర్వాత 2018లో నిర్వహించిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
అయితే.. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉందని.. ఎన్నికల్లో ఓడినప్పటికీ నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యల పట్ల స్పందిస్తూ.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. ప్రజల్లోనూ ఆయన పట్ల సానుకూల అభిప్రాయమే నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డికే టికెట్ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఈ నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్రంలో కలిపి ఇప్పటి వరకు అయిదుసార్లు గెలిచిన వ్యక్తిగా పేరొందిన జీవన్ రెడ్డికి నియోజకవర్గం ఆమూలాగ్రం అన్ని విషయాల్లో పూర్తి పట్టు ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశంగా మారింది.
అంతేకాకుండా.. 2018లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడినప్పటికీ.. ఆ తర్వాత 2019లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం పరిధిలో 39,430 ఓట్ల మెజారిటీతో గెలవడం ఆయనకు నియోజకవర్గంలో ఉన్న ఆదరణను తెలియజేస్తోంది. దీంతో.. జీవన్ రెడ్డిని నిలబెడితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం.. పార్టీ అధిష్టానంలో సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ టికెట్ సిటింగ్కే
ఇక.. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కే టికెట్ ఖరారైనట్లు సమాచారం. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచిన ఆయన ఈ సారి కూడా గెలుపు కోసం కృషి చేస్తున్నారు. వాస్తవానికి జగిత్యాలలో టీఆర్ఎస్ ఆనవాళ్లు లేని సమయంలో, టీడీసీ, కాంగ్రెస్ల హవాను చెదరగొట్టి కారు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లిన సంజయ్కు అధిష్టానం దగ్గర కూడా సానుకూల అభిప్రాయమే ఉంది. దీంతో ఆయనకు టికెట్ ఖరారు అనేది స్పష్టమవుతోంది. ఆయన అభివృద్ధే ఎజెండాగా ప్రచార పర్వం సాగిస్తున్నారు.

తోడుగా రమణ
బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేకు కలిసొస్తున్న మరో అంశం.. టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ రమణ సహకారం పూర్తి స్థాయిలో ఉండడం. నియోజవర్గంలో ఈ ఇద్దరు నేతల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అదే సమయంలో ఎమ్మెల్సీ రమణ సామాజిక వర్గం (పద్మశాలి) ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు రమణకు తన సామాజిక వర్గంలోనూ మంచి పట్లు ఉందనే సమచారం. దీంతో.. నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గానికి ఉన్న దాదాపు 30 వేల ఓట్లను తమ వైపు మలచుకునేందుకు సంజయ్కు అండగా రమణ కూడా బీఆర్ఎస్ ప్రచార పర్వంలో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన పద్మశాలిల సభకు అన్నీ తానై వ్యవహరించిన విషయం తెలిసిందే.
మైనారిటీ ఓట్లపై జీవన్ రెడ్డి ఆశలు
మరోవైపు కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్న జీవన్ రెడ్డి మైనారిటీ ఓట్లపై ఆశలు పెట్టుకుని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఓట్ల సంఖ్య కూడా దాదాపు 30 వేలుగా ఉంది. 2014 ఎన్నికల్లో ఈ ఓట్లే జీవన్ రెడ్డి విజయానికి దోహదం చేశాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. ఈ వర్గాల ప్రజలు తనవైపు తిరిగేలా ఆయన మళ్లీ పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, అధికార పార్టీ నేతలు వీటికి పరిష్కారం చూపకపోవడం వంటి వాటిని ఆయన ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

బీజేపీ.. రేసులో ఎందరో
మరో ప్రధాన పార్టీ బీజేపీలో మాత్రం టికెట్ల కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిన ముదుగంటి రవీందర్ రెడ్డి టికెట్ రేసులో ముందున్నారే సమాచారం. అయితే.. ఆయనతోపాటు జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి కూడా టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్లో ఉంటూ.. ఎమ్మెల్యే సంజయ్ వేధింపులకు గురి చేస్తున్నాడని రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆమె.. తనకు ప్రజల మద్దతు ఉందని అందుకే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాననని చెబుతున్నట్లు సమాచారం. అదే ధీమాతో ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ప్రజలు తనవైపే ఉంటారని, అందుకే టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే.. ఆమెతోపాటు రైతు సంఘం నేత పన్నాల తిరుపతి రెడ్డి, గత ఎన్నికల లో తెరాస ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి కుడి భుజంలా పని చేసి ఎమ్మెల్యే గెలుపుకు కారణం అయినా రాయికల్ మాజీ ఎంపీపీ మున్నూరు కాపు సామజిక వర్గం లో పేరు కలిగి ఆర్థికం గా సామజికంగా స్థిరపడిన పడాల పూర్ణిమ తిరుపతిబీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్నారు. ఇతర నాయకులు మదన్మోధన్, శైలేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. దీంతో.. బీజేపీ టికెట్ ఎవరికివ్వాలి అనేది పార్టీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ఇదే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కలిసొస్తుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించినా.. ప్రజల్లోకి వెళ్లడంలో పార్టీ వెనుకంజలో ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బీసీ ఓట్లే కీలకం
ఇక.. అభ్యర్థుల జయాపజయాలను నిర్దేశించడంలో బీసీ ఓట్లే కీలకంగా నిలవనున్నాయి. ఈ క్రమంలో దాదాపు 2.15 లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో పద్మశాలిల ఓట్లు 30 వేల వరకు, అదే విధంగా మున్నూరు కాపు ఓట్లు దాదాపు 25 వేలు, ముస్లిం మైనారిటీ ఓట్లు దాదాపు 30 వేలు వరకు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరితోపాటు దళితుల ఓట్లు కూడా 30 వేల వరకు ఉన్నట్లు సమాచారం. దీంతో.. అన్ని వర్గాలకు ఓట్ల సంఖ్యలో సమ ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అధికార బీఆర్ఎస్, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వర్గాల నేతలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. బీజేపీ మాత్రం మైనారిటీ, దళిత ఓటర్లను సమీకరించడంలో వెనుకంజలో ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన జగిత్యాలలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది. అదే విధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు సాగడం ఖాయమనేది తెలుస్తోంది.
జగిత్యాల నియోజకవర్గం ముఖ్యాంశాలు:
- మొత్తం ఓటర్లు: దాదాపు 2.15 లక్షలు
- కీలకంగా బీసీ ఓటర్లు
- పద్మశాలి, మున్నూరు కాపు, మైనారిటీ వర్గాల కీలక పాత్ర



