- Advertisement -
అవినీతిని బయిటపెట్టినందుకు ఐపీఎస్ పై హత్యాయత్నం
Assassination attempt on IPS for rooting out corruption
చెన్నై, ఫిబ్రవరి 5, (వాయిస్ టుడే)
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణిపై హత్యాయత్నం సంచలనంగా మారింది. తనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె డీజీపీకి రాసిన లేఖ వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తమిళనాడు జరిగిన ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. డీజీపీ శంకర్ జివాల్కు అడిషినల్ డీజీపీ కల్పనా నాయక్ రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతేడాది జులై 29న చెన్నై నగరంలోని తన కార్యాలయం మంటల్లో కాలిబూడిదయ్యిందని, ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని ఆ లేఖలో ఏడీజీపీ పేర్కొన్నారు.తనను లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యాయత్నంగా అనుమానిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. పోలీసు శాఖలో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, జైలువార్డెస్లు, ఫైర్ సిబ్బంది ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలను బయటపెట్టిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగిందని సీనియర్ ఐపీఎస్ అధికారిణి లేఖలో తెలిపారు. కోర్టు ఉత్తర్వులను అధిగమించి ఎంపిక ప్రక్రియను అడ్డుకుని.. దానివల్ల జరగబోయే అప్రతిష్ట నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడానని చెప్పారు. అదే తన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టిందని కల్పనా నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రోజున కొద్ది నిమిషాలకు ముందు కార్యాలయానికి తాను వెళ్లుంటే ప్రాణాలు పోగొట్టుకునేదాన్ని అని చెప్పారు. ఉద్యోగాల ఎంపిక తన ఆమోదం లేకుండానే జరిగినట్లు ఆమె ఆరోపించారు.ఓ సీనియర్ పోలీసు అధికారి ప్రాణాలకే భద్రత లేనప్పుడు, సాధారణ పోలీసుల పరిస్థితి ఏంటి? అని నాయక్ ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన 15 రోజుల తర్వాత ఆగస్టు 15న తాను డీజీపీకి లేఖ రాశానని, దాని ప్రతులను హోంశాఖ కార్యదర్శి, చెన్నై పోలీస్ కమిషనర్కు కూడా పంపినట్లు చెప్పారు. తనను లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యాయత్నంపై విచారణ జరపాలంటూ ఆరునెలల కిందటే ఆదేశించినప్పటికీ నివేదిక ఇంకా బయటపెట్టలేదన్నారు.అటు, ఏడీజీపీ కల్పనా నాయక్ ఆరోపణలపై డీజీపీ వివరణ ఇచ్చారు. ఆమె ఆఫీసులో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రలు లేవన్నారు. ఆ సంఘటన ప్రమాదంగానే భావిస్తున్నామని డీజీపీ శంకర్ జివాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డీజీపీ ఆఫీసులో ఆమె ఫిర్యాదు చేశారని, దీనిపై ఎగ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని వివరించారు. ఫోరెన్సిక్, అగ్నిమాపకశాఖ నిపుణులు, విద్యుత్ శాఖ అధికారుల ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు.అటు, ఏడీజీపీ లేఖపై మాజీ సీఎం, ప్రతిపక్షనేత ఎడిప్పాడి పళనిసామి స్పందిస్తూ.. ఉద్యోగ నియమాకాల్లో అవినీతిని బట్టబయలు చేసిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిణిపై హత్యాయత్నం జరగడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని పీఎంకే అధినేత ఎస్ రాందాస్ డిమాండ్ చేశారు.
- Advertisement -