ఏన్కూరులో వాటర్ క్యాన్ ధరల దోపిడీపై ఉక్కుపాదం
• గ్రామసభల నిర్ణయాలతోనే ధరల ఖరారు – ట్రేడ్ లైసెన్స్ లేకుండా ప్లాంట్లకు నో ఎంట్రీ
• ప్రజలకు అందుబాటు ధరల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించాలంటూ అధికారుల కఠిన హెచ్చరికలు
వాయిస్ టుడే/ ఏన్కూర్ :
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో తాగునీటి వాటర్ క్యాన్ల ధరల పెంపుపై మండల అధికారులు సీరియస్గా స్పందించారు. రూ.10కు అందాల్సిన వాటర్ క్యాన్ను కొందరు నిర్వాహకులు రూ.20 వరకు విక్రయిస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మండల పరిపాలన అత్యవసర సమావేశాన్ని నిర్వహించి కఠిన నిర్ణయాలు తీసుకుంది.ఏన్కూరు మండల పరిధిలో పనిచేస్తున్న అన్ని RO వాటర్ ప్లాంట్ యాజమాన్యాలను మండల కార్యాలయానికి పిలిపించిన అధికారులు ధరల నియంత్రణ, నీటి నాణ్యత, ప్రభుత్వ నిబంధనలు, ట్రేడ్ లైసెన్సులు, ప్రజారోగ్య ప్రమాణాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా ఏన్కూరు MPDO పి. భాగ్యశ్రీ మాట్లాడుతూ తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కు అని, దానిని వ్యాపార దోపిడీగా మార్చే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన తాగునీరు అందించడం ప్రతి ప్లాంట్ యాజమాన్య బాధ్యత అని పేర్కొన్నారు.ప్రతి వాటర్ ప్లాంట్ నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత గ్రామపంచాయతీ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి వాటర్ క్యాన్ ధరలు, సరఫరా విధానం, నీటి నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను సేకరించి గ్రామసభ తీర్మానం ఆధారంగానే భవిష్యత్ ధరలను నిర్ణయించాలని స్పష్టం చేశారు.ఇకపై అనుమతులు లేకుండా ప్లాంట్లు నిర్వహించడం, ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ప్రతి ప్లాంట్ తమ నీటి శుద్ధి విధానం, మినరల్ ప్రమాణాలు, ఫిల్ట్రేషన్ సామర్థ్యం, నీటి నాణ్యత పరీక్షల వివరాలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి మండల అధికారులకు సమర్పించాలని సూచించారు.తహసీల్దార్ చి. శేషగిరిరావు మాట్లాడుతూ మండలంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలు అధిక ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించామని చెప్పారు. ప్రజలకు న్యాయం జరిగేలా గ్రామపంచాయతీలతో సమన్వయం చేసుకుని కఠిన చర్యలు కొనసాగిస్తామని వెల్లడించారు.అదేవిధంగా ఈ అంశంపై RWS శాఖ అధికారులకు కూడా సమాచారం జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తాగునీటి సరఫరా, నాణ్యత ప్రమాణాలు, ప్లాంట్ల నిర్వహణపై RWS శాఖ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే సంయుక్త తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్లాంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.మండల ప్రజలు కూడా అధికారుల చర్యలను స్వాగతిస్తూ వాటర్ క్యాన్ ధరలను నియంత్రించి అందరికీ అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యపరంగా మంచి పరిణామమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.



