శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తమ లగేజిని, మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసి తిరిగి తీసుకునే ప్రక్రియను వేగంగా, సులభంగా చేపట్టేందుకు డిజిటలైజేషన్, ఆటోమేషన్ ద్వారా నూతనంగా బాలాజి బ్యాగేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్తో కలిసి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేస్తే తిరిగి తీసుకోవడం ఆలస్యమవుతుందని భావించి కొందరు భక్తులు తమ వెంట ఫోన్లను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత విధానంలో లగేజి గానీ, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను డిపాజిట్ చేస్తే ఎక్కువ సమయం వేచి ఉండకుండా సులభంగా తిరిగి పొందవచ్చన్నారు. నూతన విధానంలో భక్తులు లగేజి కౌంటర్ వద్దకు చేరుకోగానే వారి వద్ద ఉన్న దర్శన టికెట్ ను స్కాన్ చేసి వాటి వివరాలు ఎలక్ట్రానిక్ డివైస్ లో ఆటోమేటిక్ గా నిక్షిప్తం చేయడం జరుగుతుందన్నారు. దర్శన టికెట్ లేని భక్తులకు వారి వివరాలు, పేరు నమోదు చేసుకుని బ్యాగ్ కు ఆర్ఎఫ్ఐడి నిక్షిప్తమైన ట్యాగ్ ను టైప్ క్లిప్ ద్వారా జతపరిచి ఆటోమేటిక్ జనరేటెడ్ క్యూఆర్ కోడ్ రసీదును ఇస్తారని చెప్పారు. అదేవిధంగా మొబైల్ డిపాజిట్ సమయంలో దర్శనటికెట్, ఆధార్, భక్తుల వివరాలు సేకరిస్తారని వివరించారు. ఆ తరువాత వారి మొబైల్ ను భద్రంగా పౌచ్లో ఉంచి వాటిని క్యూఆర్ కోడ్కు అనుసంధానం చేసి భక్తులకు రసీదు అందజేస్తారని తెలిపారు.




