- Advertisement -
పచ్చదనం, పరిశుభ్రత మనందరి బాధ్యత
Greenery and cleanliness is the responsibility of all of usకమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి
పరిసరాల పరిశుభ్రతతో పాటు, పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం సీతమ్మ నగర్ మాస్టర్ ప్లాన్ రోడ్ లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల మహిళలతో కలిసి కమిషనర్ మౌర్య మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా 15 రోజులు పాటు గాంధీ జయంతి వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే మొక్కలు నాటడం, పరిసరాలు పరిశుభ్రం చేయడం, వేస్ట్ టు వండర్ ఆర్ట్, పలు ప్రాంతాల్లో పెయింటింగ్ వేయించడం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మొక్కలు నాటడమే కాదని వాటిని పరిరక్షించడం కూడా మన బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజలు తడి, పొడి చెత్త వేరువేరుగా చేసి తమ సిబ్బందికి అందించాలన్నారు. చాలామంది చెత్తను మురుగుకాలువల్లో వేసేస్తున్నారని, దీంతో మురుగు నీరు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి అన్నారు. ప్రజలు అవగాహనతో చెత్తను తమ సిబ్బందికి అందించాలని కోరారు. పరిశుభ్రత అంటే మన ఇల్లు మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అన్నారు. ఇటీవల హెల్త్ ఆఫీసర్, తమ సిబ్బందితో కలిసి నగరంలో ప్లాస్టిక్ రైడ్స్ నిర్వహించామని, పెద్ద ఎత్తున నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాదినం చేసుకున్నామని అన్నారు. దుకాణదారులకు 30రోజులు గడువు ఇచ్చామని, ఇకపై ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించామని అన్నారు. ఈ ప్లాస్టిక్ నిషేధంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, ప్లాస్టిక్ తయారు చేసే వారిపై చర్యలు తీసుకుందామని అన్నారని తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు వినియోగించ వద్దని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




