- Advertisement -
ఎస్సీ, ఎస్టీలకు భారీగా ప్రోత్సహకాలు
Huge incentives for SC and ST
హైదరాబాద్, సెప్టెంబర్ 18, (వాయిస్ టుడే)
సొంత ఉపాధి కేంద్రం పెట్టుకోవాలనేది యువతకు కల. సాంకేతిక ప్రపంచంలో స్టార్టప్ లు పెట్టుకోవడం ఎలాగో.. తయారీ రంగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు అలా పెట్టుకుని సొంత కాళ్లపై నిలబడి.. మరో పది మందికి ఉపాధి కల్పించాలని పట్టుదలతో శ్రమించేవారు ఉంటారు. ఇలాంటి వారికి ప్రోత్సాహం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా ఈ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పాలసీని ప్రకటించింది. శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ పాలసీని విడుదల చేసి తమ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఇరవై పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలనుకుంటోంది. అందులో ఇరవై శాతం ప్లాట్లను చిన్న పరిశ్రమల కోసం రిజర్వ్ చేస్తారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్.. రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రభుత్వం పది పారిశ్రామిక పార్కులను నిర్మించబోతోంది. వీటిలో ఐదు ప్రత్యేకంగా సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమల కోసమే కేటాయిస్తారు. ప్రతి పారిశ్రమిక పార్కులో మహిళలకు ఐదు శాతం.. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు పదిహేను శాతం ప్లాట్లు రిజర్వ్ చేస్తారు. ప్రభుత్వం చిన్నతరహా పరిశ్రమలను ప్రత్యేకంగా కసరత్తు చేసి గుర్తించింది. మొత్తంగా ఆరు సమస్యలను గుర్తించింది. భూమి , మూలధనం, ముడిపదార్థాలు, శ్రామిక శక్తి, సాంకేతిక సౌలభ్యత, మార్కెట్తో అనుసంధానం వంటి సమస్యల వల్ల సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సవాళ్లుగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించడానికి కొత్త పాలసీలో దాదాపుగా నలభై ప్రతిపాదనలు చేసింది. సరసమైన ధరలకు భూమిని అందుబాటులో ఉంచడం దగ్గర నుంచి అన్ని అంశాల్లో ప్రభుత్వ పరమైన సాయం అందించాలని నిర్ణయించారు. మొత్తంగా ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినూ వెన్నుదన్నుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తెలంగాణకు పారిశ్రామిక పాలసీ ఉంది. దాన్ని టీఎస్లఐపాస్ గా పిలుస్తున్నారు. అయితే ఇది పెద్ద పరిశ్రమలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ చిన్న , సూక్ష్మ తరహా పరిశ్రమల విషయంలో ప్రయోజనకరంగా లేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు MSMEలకు కొత్త పాలసీ రూపొందించామని ఉన్నతాధికారి జయేష్ రంజన్ ప్రకటించారు. చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం ఉంటుందన్నారు.
- Advertisement -