సెప్టెంబర్ 13న ఖమ్మం గడ్డపై జనసేన “తెలంగాణ రాష్ట్ర శంఖారావం”
Janasena’s “Telangana State Battle Cry” in Khammam on September 13.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా జనసేన.. భారీగా తరలిరావాలని గడల శ్రీనివాస్ పిలుపు
ఖమ్మం: ప్రజా సమస్యలు, నిరుద్యోగ యువత, పట్టభద్రుల ఆకాంక్షలు, యువత భవిష్యత్తు, సామాజిక న్యాయం తదితర అంశాలపై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా జనసేన తెలంగాణలో తన కార్యాచరణను మరింత విస్తృతం చేయనున్నట్లు జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాస్ తెలిపారు.
ఈ నెల 13న ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్లో “తెలంగాణ రాష్ట్ర శంఖారావం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం, యువతకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగుల సమస్యలు, పట్టభద్రుల ఆకాంక్షలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
వనజీవి రామయ్యకు ఘన నివాళి
ప్రకృతి పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య సేవలకు గుర్తింపుగా శంఖారావం సభా ప్రాంగణానికి **“పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రాంగణం”**గా నామకరణం చేయనున్నట్లు గడల శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి “వనజీవి రామయ్య వారధి”గా పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రకృతి పరిరక్షణ, పర్యావరణం, ప్రజల జీవన విధానంతో ముడిపడిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
భారీగా తరలిరావాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలలతో పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి జనసైనికులు, వీరమహిళలు, యువత, విద్యార్థులు, పట్టభద్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలంగాణ రాష్ట్ర శంఖారావాన్ని విజయవంతం చేయాలని గడల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
“ఇది కేవలం ఒక సభ కాదు.. ప్రజల సమస్యలపై చర్చకు వేదిక. యువత భవిష్యత్తు కోసం గళమెత్తే వేదిక. మార్పు కోసం పోరాటానికి నాంది. ఖమ్మం గడ్డ నుంచి తెలంగాణకు జనసేన బలమైన సందేశాన్ని ఇవ్వాలి” అని ఆయన అన్నారు.
యువత కోసం.. ప్రజల కోసం.. సామాజిక న్యాయం కోసం.. మార్పు కోసం.. ఖమ్మం గడ్డపై గొంతెత్తుదాం.. శంఖం పూరిద్దాం అని గడల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.




