పక్కా ప్లాన్ తో కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 24 ( వాయిస్ టుడే )
Kavitha with a Solid Plan
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నాక.. రెండు రోజుల్లో కొత్తపార్టీకి కూడా
రెడీ అయ్యారు. అయితే.. తండ్రి నుంచి తెచ్చుకున్న వారసత్వమో.. లేక స్వతహాగానే.. సంపాయించుకున్న పొలిటికల్ తెలివి తేటలో మొత్తంగా.. ఏదేమైనా.. పార్టీ పెట్టకుండానే.. రాజకీయంగా పరుగులు
పెడుతున్నారు. ఏ క్షణాన ఏ పార్టీ నుంచి ఎవరికి స్వాగతం పలుకుతారో.. అన్న చర్చ తెరమీదకు వచ్చిందంటే.. కవిత దూకుడు ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా
వరకు కూడా ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్కు బలమైన కేడర్ ఉంది. నాయకులు కూడా ఉన్నారు. ఇదేసమయంలో అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులకు కూడా కొదవలేని జిల్లాలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అసంతృప్త నాయకులకు కవిత ఆహ్వానాలు పలుకుతున్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీలు మారి.. బీఆర్ ఎస్లో చేరిన నాయకులు.. తర్వాత కాలంలో పెద్దగా గుర్తింపు పొందలేదు. గత ఎన్నికల్లో
టికెట్లు కూడా కోల్పోయారు. ఇప్పుడు అలాంటి వారికి కవిత పెట్టబోయే పార్టీ తురుపు ముక్కగా మారింది. మరోవైపు.. కవితకు వీరే పెద్దదిక్కుగా కూడా మారుతున్నారు.ఆదిలాబాద్కు చెందిన మాజీ
ఎమ్మెల్యే బోధ్ నియోజకవర్గానికి చెందిన రాధోడ్ బాపూరావు ఇటీవ లేకవిత సమక్షంలో జాగృతి కండువా కప్పుకొన్నారు. నిజానికి సీనియర్ నాయకుడిగా పేరున్న బాపూరావుకు.. గిరిజన సామాజిక
వర్గంలో బలమైన కేడర్ ఉంది. గతంలో కాంగ్రెస్ తర్వాత.. బీఆర్ ఎస్.. గత ఎన్నికలకు ముందు బీజేపీ లో చేరిన ఆయన.. తిరిగి మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నా.. కూడా ఆయనకు
గుర్తింపు లేదన్న కారణంతో.. ఇప్పుడు కవిత కు జై కొట్టారు. ఇలాంటి వారి వల్ల తన పార్టీతొందరగా పుంజుకుంటుందన్న ఉద్దేశంతో కవిత సైతం ఆయనకు స్వాగతం పలికారుఈయన ఒక్కరే కాదు..
జిల్లాలోని పలువురు మాజీ బీఆర్ ఎస్ నాయకుల నుంచి ప్రస్తుత కాంగ్రెస్ నాయకుల వరకు కూడా కవిత ఇంటికి క్యూకట్టారని జాగృతి నాయకులు చెబుతున్నారు. ఇక, ఖమ్మంలో మాజీ ఎమ్మెల్యే..
ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి.. తర్వాత బీఆర్ ఎస్లోకి చేరిన ఉపేంద్రరెడ్డి సైతం కవితకు టచ్లోకి వచ్చారు. ఈయన కూడా బలమైన కేడర్ ఉన్న నాయకుడే. పార్టీ ప్రారంభం కాగానే..కండువా కప్పుకొనేందుకు
రెడీ అయ్యారు. ఇక, ఈయనతో పాటు.. ఖమ్మానికి చెందిన సీనియర్నాయకుడు, మాజీ మంత్రి ఒకరు రెడీగా ఉన్నారన్న చర్చ సాగుతోంది.పార్టీ ప్రారంభించనున్న వేదికపైనే కవిత బలమైన 10 మంది
నాయకులకు కండువా కప్పేలా ప్లాన్ చేశారని జాగృతి నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం వారితో చర్చలు కూడా పూర్తయ్యాయని, పార్టీ ఆవిర్భావం రోజు.. వారికి వేదికపైనే తీర్థం ఇవ్వనున్నారని అంటున్నారు.
వీరిలో కాంగ్రెస్.. బీఆర్ ఎస్ నాయకులు కూడా ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా.. కేసీఆర్ తనయ.. తన రాజకీయ వ్యూహాలను చాలా సైలెంట్గా ముందుకు తీసుకువెళ్తున్నారు. అదేసమయంలో
దూకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఐదు లక్షల మంది కోసం ప్లానింగ్
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి కల్వకుంట్ల కవిత రంగం సిద్ధం చేశారు. అత్యంత పక్కా ఫ్రేమ్వర్క్ , వ్యూహాత్మక పబ్లిసిటీతో ఆమె తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నెల
25న మేడ్చల్ వేదికగా జరగనున్న పార్టీ ఆవిర్భావ సభను మునుపెన్నడూ చూడని రీతిలో నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కవిత భారీ
కటౌట్లు, హోర్డింగ్లు కనిపించేలా చేస్తున్నారు. నేటి తరం రాజకీయాల్లో పబ్లిసిటీ పవర్ ఎలాంటిదో తెలుసు కాబట్టి అలాగే ముందడుగు వేస్తున్నారు.తన కొత్త పార్టీ అస్తిత్వాన్ని చాటుకోవడానికి కవిత మేడ్చల్
ఆవిర్భావ సభను ఒక ప్రతిష్టాత్మక వేదికగా ఎంచుకున్నారు. గత వారం జరిగిన కేసీఆర్ జగిత్యాల సభ కంటే రెట్టింపు జనాభాను సమీకరించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు ఐదు లక్షల
మందికి పైగా జనాన్ని సమీకరించేలా నియోజకవర్గాల వారీగా బాధ్యతలు పంపిణీ చేశారు. ఖర్చుకు వెనుకాడకుండా, అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా తన రాజకీయ సత్తాను చాటి,
రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆమె భావిస్తున్నారు.పార్టీ ప్రకటనకు సమయం దగ్గర పడుతున్నా, ఇప్పటివరకు పార్టీ పేరు కానీ, జెండా రూపకల్పన కానీ లీక్ కాకుండా అత్యంత
రహస్యంగా ఉంచడం కవిత వ్యూహ చాతుర్యానికి నిదర్శనం. సభ వేదికపైనే పేరును ప్రకటించడం ద్వారా అటు మీడియాలో, ఇటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేలా ప్లాన్ చేశారు. కేవలం భావోద్వేగాలతో
కాకుండా, పక్కా కార్యాచరణ, విధివిధానాలతో ఈ పార్టీ రాబోతోందని భావిస్తున్నారు. బంధుత్వాల కంటే సిద్ధాంతాలకే పెద్దపీట వేస్తానని ఇప్పటికే సంకేతాలు ఇవ్వడం ద్వారా తన ప్రయాణం స్వతంత్రంగా
ఉండబోతోందని ఆమె స్పష్టం చేశారు.రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత అనుబంధాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని కవిత భావిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో కేసీఆర్ అనుసరించిన
కొన్ని విధానాలను ఆమె తప్పుపట్టడం ద్వారా తన గళం భిన్నంగా ఉంటుందని నిరూపించుకున్నారు. ఆవిర్భావ సభలో ఆమె చేసే ప్రసంగం కేవలం కాంగ్రెస్, బీజేపీలకే కాకుండా, బీఆర్ఎస్ శ్రేణులకు కూడా
ఒక బలమైన సందేశాన్ని ఇచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. తన తండ్రి నుంచి వారసత్వాన్ని కాకుండా, తనకంటూ ఒక సొంత ముద్ర వేసుకుని, తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఎదగాలనుకుంటున్నారు.
ఆమె ప్రయత్నాలు ఏ స్థాయిలో ఫలిస్తాయో చూడాల్సి ఉంది.



